హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితుడిగా ఉన్న సినీ దర్శకుడు క్రిష్ గచ్చిబౌలి పోలీసుల విచారణకు శుక్రవారం హాజరయ్యారు. పరీక్షల కోసం అతడి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్కు తరలించిన పోలీసులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. తాను పార్టీకి హాజరైన మాట వాస్తవమేనని, డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని చెప్పినట్టు తెలిసింది. డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానంద, టాలీవుడ్ నిర్మాత కేదారినాథ్, వ్యాపారవేత్త నిర్భయ్, డ్రగ్స్ సరఫరాదారులు అబ్బాస్ అలీ జాఫ్రీ, మీర్జా వహీద్, వివేకానంద డ్రైవర్ ప్రవీణ్లను పోలీసులు అరెస్టు చేయగా, నటి లిషీ గణేశా, యూట్యూబర్ శ్వేత, సందీప్, నీల్ పరారీలో ఉన్నారు. కాగా డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ పాతబస్తీకి చెందిన మీర్జా వహీద్ వద్ద కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడించడంతో మీర్జా వహీద్ను సైతం పోలీసులు అరెస్టు చేసి విచారించారు.
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని డ్రగ్స్ కేసులో నిందితుడు సినీ దర్శకుడు క్రిష్ హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ జీ రాధారాణి శుక్రవారం విచారణ చేపట్టారు. మొదటి నిందితుడు జీ వివేకానంద ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్పై తప్పుడు కేసు పెట్టారని, ప్రధాన నిందితుడికి రిమాండ్ విధించేందుకు కింది కోర్టు నిరాకరించిందని క్రిష్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పోలీసుల వివరణ నిమిత్తం విచారణ ఈ నెల 4కి వాయిదా పడింది.