హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని సైతం రాజకీయాలకు వాడుకొంటున్నది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ విరమణ సందర్భంగా ఇచ్చిన అధికారిక విందును ఎన్డీయే కార్యక్రమంగా మార్చేసింది. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన విందుకు బీజేపీ పాలిత, ఆ పార్టీ అనుకూల ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలకు ఆహ్వానం పంపింది. సాధారణంగా అన్నిరాష్ర్టాల ముఖ్యమంత్రులను పిలవాల్సిన సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. కోవింద్కు వీడ్కోలు పలికేందుకు కాకుండా, రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు సహకరించినవారికి ధన్యవాదాలు తెలిపేందుకు విందు ఏర్పాటుచేసినట్టు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన అధికారిక కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేసి దేశ అత్యున్నత పదవిని అవమానించిందని మేధావులు మండిపడుతున్నారు. బీజేపీ దృష్టిలో రామ్నాథ్ కోవింద్ కేవలం కొన్ని రాష్ర్టాలకే రాష్ట్రపతా? లేక అది బీజేపీ పార్టీ కార్యక్రమమా? అని నిలదీస్తున్నారు. దేశానికి ఐదేండ్లపాటు సేవలందించిన వ్యక్తికి సంకుచిత మనస్తత్వంతో వీడ్కోలు పలికి అవమానిస్తారా? అని సోషల్మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. వీడ్కోలు విందుకు జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు సైతం కేంద్రం ఆహ్వానం పంపింది. పవన్ ఎంపీ, ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం సర్పంచిగా కూడా గెలువలేదు. దీన్ని బట్టి అధికారిక కార్యక్రమాలను బీజేపీ రాజకీయాల కోసం వాడుకొంటున్నదని స్పష్టమవుతున్నది. నరేంద్ర మోదీ దేశం మొత్తానికి ప్రధాని కాదని, బీజేపీ పాలిత రాష్ర్టాల ప్రయోజనాల కోసమే పనిచేస్తారని గతంలో అనేక సార్లు రుజువైంది. తాజా ఘటనలతో సంకుచిత మనస్తత్వం మరోసారి ప్రపంచానికి తెలిసిందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.