వికారాబాద్ : జిల్లాలోని కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద విహార యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం పరిగి నియోజకవర్గం పూడూరు మండలం మన్నెగూడ గ్రామంలో మృతులు జగదీశ్, వెంకటేశ్, లోకేశ్, రాజేశ్ మృతదేహాల వద్ద నివాళి అర్పించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కుటుంబ సభ్యులతో ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె వెంట ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. నిన్న విహార యాత్రం కోసం కోట్ పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లగా ఒకరు ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కవగా ఉండడంతో గల్లంతయ్యాడు. సదరు యువకుడిని కాపాడేందుకు మరో ముగ్గురు యువకులు ప్రాజెక్టులోకి దూకి గల్లంతు అయ్యారు.
విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని యువకులను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వారి మృతదేహాలను జాలర్లు బయటకు తీశారు. మరో వ్యక్తి సాయంత్రం దొరికింది.