BRS | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు అంశాలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డితో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సమావేశమయ్యారు.స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ప్రొటోకాల్ ఉల్లంఘన, గన్మెన్ల కుదింపు తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్రెడ్డిని కలిశామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఎస్డీఎఫ్ నిధులు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వివరించారు.
ముఖ్యమంత్రిని కలవడానికి ముందు గన్మెన్ల కుదింపు అంశాన్ని ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్రెడ్డిని కలిశామని కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సోమవారం కలిసినట్టు చెప్పారు. తనకు గన్మెన్లను కుదించిన విషయాన్ని సీఎం, ఇంటెలిజెన్స్ ఐజీ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వివరించారు.
అభివృద్ధి కోసమే కలిశాం
పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరినట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తాము ముఖ్యమంత్రిని కలిసిన అంశంపై అనవసర ఉహగానాలు చేయవద్దని ఆయన కోరారు. ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్రెడ్డి ఎలా కలిశారో, తాము అలానే కలిసామని స్పష్టం చేసారు. రాబోయే లోక్సభ ఎన్నికలలో తమ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మెదక్ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరేస్తామని మహిపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.