మెదక్ : కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువొచ్చిందని, ఎండిన పంట పొలాలకు(Dry crops) నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్(Medak) జిల్లా నార్సింగి మండలంలోని నర్సంపల్లి తండాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతు కుటుంబాలు పంటలు ఎండిపోవడంతో ఎంతో నష్టపోయారన్నారు.
పంట పొలాలను కాపాడటానికి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని, అది మరిచి ప్రతిపక్ష నాయకులను చేర్చుకోవడానికి పార్టీ గేట్లు ఎత్తుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుభరోసా, రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కరెంటు కూడా సక్రమంగా రావట్లేదు ..ఇప్పటికైనా నీళ్లు విడిచి పంటలను కాపాడాలన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి 15 వేల రూపాయలు పరిహారం అందించాలన్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ నుంచి పంట పొలాలకు నీళ్లను విడుదల చేసి వాగు వంకలు, చెరువు కుంటలు నింపాలని డిమాండ్ చేశారు.