పెద్దపల్లిరూరల్, మే 8 : ‘రైతులు(Farmers) అధైర్యపడవద్దు. అండగా ఉంటాం. మీ వెంట బీఆర్ఎస్ ఉంది. కేసీఆర్తో పాటు మేమంతా ఉన్నం. తడిసిన ధాన్యాన్ని(Stained grain) ఎలాంటి షరతులు లేకుండా కొనేదాకా ప్రభుత్వంతో కొట్లాడుతాం. గత యాసంగిలో నీరందక ఎండిన పంటలకు నష్ట పరిహారం ఇచ్చేదాకా ఊరుకోం’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అభయమిచ్చారు.
పెద్దపల్లి(Peddapalli) నియోజకవర్గంలోని సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గమధ్యంలో పెద్దబొంకూర్ వద్ద కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కొప్పుల దగ్గరికి వచ్చి ‘మా బతుకులు గిట్లయినయేంది సారూ’ అంటూ ఆవేదన వ్యక్తం చేయగా, ‘మేమున్నాం..’ బాధపడొద్దంటూ’ ఓదార్చారు. అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయడం వల్లే కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందన్నారు.
రైతులంటేనే సర్కారు చిన్నచూపు చూస్తున్నదని, అందుకే ఇన్ని కష్టాలు వస్తున్నాయన్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసే దాకా సర్కారుతో కొట్లాడుతామని, అధైర్యపడవద్దని రైతులకు భరోసా కల్పించారు. ఆయన వెంట నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మన్, కారుపాకల సంపత్కుమార్, నర్ల అంజయ్య యాదవ్, తీగల ధర్మపురి, సింగిల్ విండొ డైరెక్టర్ మెట్టు సమ్మయ్యగౌడ్, పల్లె సుందర్, రైతులు ఉన్నారు.