హైదరాబాద్ : న్యాయవాదులు(Lawyers) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అన్నారు. మంగళవారం గోదావరిఖని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరాయి వ్యక్తుల చేతిలోకి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధికి మూల కారణం కేసీఆర్ అని అన్నారు.
రాష్ట్రం ఏర్పడకపోతే తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి జరిగేది కాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో న్యాయవాదుల పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమలుకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వం ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉండాలని తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎల్లప్పుడు కృషి చేస్తానని.. ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్, నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, బార్ అసోసియేషన్ బాధ్యులు తవుటం సతీష్, రాంటెంకి శ్రీనివాస్, పులిపాక ప్రవీణ్, గోశిక ప్రకాష్, సీనియర్ న్యాయవాదులు నడిపెల్లి కిషన్ రావు, సంజయ్ కుమార్, శైలజ, మురళీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.