పెద్దపల్లి : నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లాలోని పెద్దపల్లి మండలం చీకురాయి, భోజన్నపేట గ్రామాల మధ్య హుస్సేన్ మియా వాగు వెంట సాగునీరందక ఎండుతున్న(Dry crops) పంట పొలాలను పరిశీలించారు. చీకురాయి శివారులో ఎండుతున్న వరిపంటను చూసి రోదిస్తున్న రైతు ఆకుల వెంకటేష్ను ఓదార్యారు.
రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతి కొచ్చిన పంటలు నీళ్లు లేక ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. తక్షణమే రైతులకు సాగు నీరు అందించి పంటలను కాపాడాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పలువురు నాయకులు, రైతులు ఉన్నారు.