హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ) : ‘గురుకుల టెండర్లలో అక్రమాలు జరిగింది ముమ్మాటికీ నిజం.. ఆధారాలు సహా నిరూపించేందుకు బీఆర్ఎస్ సిద్ధం.. దమ్ముంటే హైదరాబాద్ ప్రెస్క్లబ్కు రండి. తేదీ, సమయం మీరే చెప్పండి’ అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గురుకులాల సరుకుల టెండర్లను గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టడంలోని మతలబు ఏంటని నిలదీశారు. తెలంగాణలో సరుకులు సరఫరాచేసే కాంట్రాక్టర్లు లేరా? బడేభాయ్ మెప్పు కోసమేనా? అని సీఎం రేవంత్ను ఉద్దేశించి ప్రశ్నించారు. మంత్రులకు టెండర్లపై అవగాహనలేనిది ముమ్మాటికీ వాస్తవం, రేవంత్రెడ్డి కనుసన్నల్లోనే అక్రమ వ్యవహారం నడుస్తున్నదని ఆరోపణలు చేశా రు. సోమవారం తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, రాష్ట్ర నేతలు కిశోర్గౌడ్, రాంబల్నాయక్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేసీఆర్ ఏర్పాటుచేసిన గురుకులాలను కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. పిల్లలకు అందించే సరుకులు, బట్టల కాంట్రాక్టుల్లో అక్రమాలకు తెరలేపారని విరుచుకుపడ్డారు. ఆధారాలతో బయటపెట్టిన హరీశ్రావుపై ఎదురుదాడి చేసి తప్పించుకుంటున్నార ని ఆరోపించారు. ‘టెండర్ల ప్రక్రియతో తమ కు సంబంధం లేదని మంత్రి పొన్నం, అడ్లూ రి అంటున్నరు. మేం కూడా అదే చెబుతు న్నం. అవగాహనలేని మంత్రులను తప్పుదోవ పట్టించి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నరు. సర్కార్ పెద్దలకు కమీషన్లు ముట్టజెప్పి దోచుకుంటున్నరు’ అని విమర్శలు గుప్పించారు.
సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గురుకుల టెండర్లపై తోచినట్టు మాట్లాడి అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని కొప్పుల దెప్పిపొడిచారు. జూన్ 12న రూ. 683 కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పారు. జూన్ 18న రూ. 1,142 కోట్లని నాలుక కరుచుకున్నరు. సరుకులకు సంబంధించి రూ. 761 కోట్లను విస్మరించి తప్పుడు లెక్కలు చెప్పారని తూర్పారబట్టారు. వాస్తవానికి పిలిచింది రూ.2,685 కోట్లకు అని స్పష్టం చేశారు. టెండర్ నిబంధనలు అడ్డగోలుగా మార్చా రని ఆరోపించారు. కాంట్రాక్టు ల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముం దు ఊదరగొట్టిన కాంగ్రెస్ మాత్రం మోకా దక్కిన తర్వాత దోకా చేస్తున్నదని దుయ్యబట్టారు. చేనేత సొసైటీలు, లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్లు టెండర్లలో పాల్గొనకుండా ప్రక్రియను మార్చిందని ఆరోపించా రు. టెస్కో, లెదర్ కార్పొరేషన్లను కాదని గుజరాత్కు చెందిన మఫత్లాల్ కంపెనీకి ఐదు విలువైన కాంట్రాక్ట్లు కట్టబెట్టింది నిజంకాదా? అని ప్రశ్నించారు. దుస్తులు, బూట్లు, బెల్ట్ల కాంట్రాక్ట్ను సైతం ముంబై, ఢిల్లీకి చెం దిన గుత్తేదారులకు అప్పగించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వపెద్దలు కమీషన్లు తీసుకొని ఇక్కడి చిన్న కాంట్రాక్టర్ల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. టెస్కో, లెదర్ కార్పొరేషన్లతో పాటు బెల్లంపల్లికి చెందిన యువకుడి కంపెనీకి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వం కోర్టు తీర్పును సైతం పట్టించుకోలేదని మండిపడ్డారు.
తెలంగాణకు చెందిన కంపెనీలు నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్లు ఏమైనా ఇచ్చాయా? చెప్పాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కొప్పుల ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డితోపాటు ఉన్నతాధికారులను కలిసి ఇచ్చిన వినతిపత్రాలను బుట్టదాఖలు చేశారని విమర్శించారు. టెస్కోకు టెండర్లలో అవకాశం కల్పించాలని సీఎం రేవంత్రెడ్డికి మంత్రి కొండాసురేఖ రాసిన లేఖను పక్కనబెట్టడం శోచనీయమని అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే అడ్లూరితో సీఎం అబద్ధాలు చెప్పించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘గురుకుల టెండర్ల గురించి సంబంధిత మంత్రికి అవగాహన ఉండదు. వారి శాఖల్లో ఏం కార్యకలాపాలు నడుస్తున్నాయో తెలియదు. చివరికీ సీఎం రేవంత్రెడ్డి నిర్వహిస్తున్న హోం, విద్యాశాఖలపై పట్టులేదు’ అంటూ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో రేవంత్రెడ్డి మంత్రివర్గం పల్లీబఠాణీల క్యాబినెట్లా మారిందని ఎద్దేవా చేశారు. సవాళ్లు విసరడం, పారిపోవడం మన ముఖ్యమంత్రికి వెన్నతోపెట్టిన విద్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి.. మల్కాజిగిరి ప్రజలను మభ్యపెట్టి ఎంపీగా గెలిచారు. అడ్లూరి చేసిన సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికే ఐదుసార్లు రాజీనామా చేసేవారు అని తూర్పారబట్టారు. రేవంత్ సీఎం పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి ఉన్నదని దెప్పిపొడిచారు.