పెద్దపల్లి: సాగునీరందక పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.25 వేల పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) చేపట్టిన 36 గంటల దీక్ష కొనసాగుతున్నది. రైతులకు న్యాయం చేయాలంటూ పెద్దపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఆయన శనివారం ఉదయం దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుక పుట్టా మధుకర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వంద రోజుల పాలనతో మళ్లీ పదేండ్ల కిందటి దుస్థితి వచ్చిందని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. నమ్మి ఓటు వేస్తే.. అధ్వానమైన పాలనతో అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెడుతున్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసానికి ఎలాంటి కష్టాలుండేవో రేవంత్ సర్కార్ వచ్చినంక మళ్లీ మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగు బాటలో ఉండాల్సిన రైతులు నీటి కోసం, కరెంటు కోసం రోడ్లకపైకి వచ్చి ఆందోళన చేస్తున్నరని తెలిపారు. కాలువల్లో నీళ్లు రాక రైతులు కన్నీరు కారుస్తున్నా ఈ సర్కారు ఏ మాత్రం చలించడం లేదని, మొద్దు నిద్ర పోతున్నదని మండిపడ్డారు.
రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, వారిని ఆదుకునేదాకా ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలని, మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కార్ను తట్టి లేపి రైతులకు న్యాయం జరిగేలా చూడాలనే లక్ష్యంతో రైతు నిరసన దీక్ష చేపట్టామని చెప్పారు. కేసీఆర్ సర్కారు పదేళ్లుగా రైతులు, ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చిన వంద రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన దరిద్రం మళ్లీ వచ్చిందని మండిపడ్డారు. రైతులకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు ఇప్పటి వరకు 20 లక్షల ఎకరాల పంట పొలాలు సాగునీరందక ఎండిపోయాయని ఆందోళన చెందారు. ఎండిన పంటను తగులబెట్టడం, పశువులను మేపుతూ రైతులు బోరున విలపిస్తున్నా రేవంత్ సర్కార్ కరగడం లేదని, కనీసం ఎండిపోతున్న పంటల సర్వే సైతం చేపట్టడం లేదని విమర్శించారు. ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం పూర్తికాలం నిలువదని, కాంగ్రెస్ సర్కారుకు రైతుల గోస తప్పకుండా తగులుతుందన్నారు.