సిద్దిపేట, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ‘ఇంద్రకీలాద్రి’ గుట్టపై వెలిసిన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి సిద్ధమయ్యాడు. ఆలయంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున స్వామి కల్యాణం మేడలాదేవి, కేతమ్మ దేవితో నిర్వహిస్తారు. కల్యాణ మహోత్సవానికి పాలకవర్గం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీమత్ జగద్గురు 1008 వీరశైవ పీఠాధిపతుల ఆధ్వర్యంలో వీర శైవ ఆగమ పండితులచే కల్యాణం జరిపిస్తారు.
కల్యాణం, వేద పర్యవేక్షణకు మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా బార్సీ మహాపీఠాధిపతి గురుసిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామిజీ శనివారం రాత్రి మల్లన్న క్షేత్రానికి చేరుకుంటారని ఆలయవర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్వామి వారి కల్యాణానికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, బారికేడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. స్వామి వారి కల్యాణం అనంతరం సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నుంచి తొమ్మిది ఆదివారాలపాటు జాతర నిర్వహిస్తారు. ఉగాది వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.