చేర్యాల, ఫిబ్రవరి 6 : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి 3వ ఆదివారం సందర్భంగా రూ.55,70,464 ఆదాయం( Hundi income) వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా శనివారం రూ.3,69,032, ఆదివారం రూ.45,65, 237, సోమవారం రూ.6,36,195 ఆదాయం వచ్చిందన్నారు.
గత సంవత్సరం 3వ వారానికి రూ.37,99,740 ఆదాయం స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి రూ.17,70,724 అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామి వారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, కమిటీ సభ్యులు, అర్చకులు, ఒగ్గు పూజారులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.