Dharmpauri Arvind | లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో.. పోతుందో తెలియదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీని రేవంత్ నుంచి కోమటిరెడ్డి లాక్కుంటారని అన్నారు. కోమటిరెడ్డి ఆ తర్వాత సీఎం కుర్చీని లాక్కోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాచుకొని కూర్చున్నాడని కామెంట్ చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రలో గురువారం బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు బహిరంగ సభ నిర్వహించారు. కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ ఒక్కటే అని.. ఇద్దరూ కలిసి నిజామాబాద్ అభ్యర్థిని డిసైడ్ చేస్తారని కామెంట్ చేశారు. రైతుబంధు నిధుల్లో కోమటిరెడ్డి రూ.2వేల కోట్లు, పొంగులేటి రూ.3వేల కోట్లు బిల్లుల కింద తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. రాష్ట్రంలో 14 సీట్లకు పైనే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.