హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) నైని బొగ్గు గని కుంభకోణం వ్యవహారంలో తాను తీసుకున్న చర్యతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30వేల కోట్లు మిగిలాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంపై ఆయన స్పందించారు. ఇటీవల ఆ యన ఓ యూట్యూబ్ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందిస్తూ.. ‘ఒకరోజు ఒక చానల్ రాసింది.. మరోరోజు మరో చానల్, పేపర్ రాసినయి, దీన్ని చూసిన తర్వాత ప్రజలందరికీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురించి అర్థమయ్యింది’ అన్నారు. నైని బొగ్గు టెండర్ల వెనుక పెద్ద కథ ఉన్నదని, దీనిపై టీవీ చానళ్లు, పత్రికల్లో వార్తలు వచ్చాయని, అయితే, వెంకట్రెడ్డి స్వభావం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ‘వెంకట్రెడ్డి చర్యతోనే రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల కోట్ల రూపాయలు మిగిలాయి’ అని వెల్లడించారు. తాను జోక్యం చేసుకోకపోతే ప్రభుత్వ ఖాజానాకు రూ.30 వేల కోట్ల నష్టం వాటిల్లేదని చెప్పారు. ఈ అంశంలో తనను బద్నాం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంత్రి వెంకట్రెడ్డిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్లోని ఓ ముఖ్యనేత ఫిర్యాదులు చేయించారని, ఓ పత్రిక, చానల్లో కథనాలు వండివార్చారన్న ఆరోపణలకు తాజాగా వెంకట్రెడ్డి వ్యాఖ్యలతో బలం చేకూరుతున్నది. బొగ్గు టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మంత్రి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వివాదాస్పదమైన టెండర్లను రద్దు చేశామని ప్రభుత్వం చేప్తున్నది, కానీ, ఇదే తరహాలో సింగరేణిలో ఇప్పటివరకు ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలన్న డిమాండ్పై ప్రభుత్వం, సింగరేణిల నుంచి ఇప్పటివరకు స్పందన లేదు.
కేంద్ర ప్రభుత్వం సింగరేణిపై ద్విసభ్య కమిటీ వేసినప్పటికీ ఆ నివేదికను ఇప్పటివరకు బయటపెట్టలేదు. మరోవైపు సింగరేణి టెండర్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో స్పందిస్తూ అసలు ఎలాంటి కొత్త నిబంధనలు లేవని, అంతా సవ్యంగానే ఉన్నదని చెప్పుకొచ్చారు. అంతా సవ్యంగా ఉంటే టెండర్లు ఎందుకు రద్దయ్యాయి..? టెండర్ల రద్దుతో రూ.30వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు మిగిలాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎందుకు చెప్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.