Komatireddy Venkat Reddy | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరం ప్రాజెక్టు కడితే సగం బరాజ్ కూలిపోయింది. ఇంకా రెండు బరాజ్లు వారం పదిరోజుల్లో కూలిపోబోతున్నాయి..’ ఇవీ నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన రోడ్షోలో కాంగ్రెస్ ఎంపీ, నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఓ కాంట్రాక్టర్ అయి ఉండి.. ప్రాజెక్టు నిర్మాణంపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండికూడా కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాళేశ్వరంపై కుట్రకోణం ఉన్నదనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్లో 265 పిల్లర్లలో ఒక పిల్లర్ పాక్షికంగా కుంగిపోయింది. ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి ఇసుక కొట్టుకుపోవడంతో సమస్య వచ్చిందని తేల్చారు.
క్వాలిటీ ఆఫ్ సాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్పై అనుమతులున్నాయని వెల్లడించారు. పిల్లర్ కుంగుబాటుతో బరాజ్కు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. ఒప్పందం ప్రకారం వీటి నిర్వహణ బాధ్యత ప్రాజెక్టును నిర్మించిన కంపెనీదేనని, ఆ కంపెనీనే మరమ్మతు చేస్తుందని చెప్పారు. అయినా.. ఓ కాంట్రాక్టర్ అయి ఉండి.. ప్రాజెక్టు నిర్మాణం, అందులోని లోటుపాట్లు తెలిసిన కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కాంగ్రెస్ ఏదో కుట్ర చేస్తున్నదనే అనుమానాలకు తావిస్తున్నది.
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్లోని ఓ పిల్లర్ గత నెల 21న కుంగిపోయింది. అయితే, ఆ సమయంలో అక్కడ పేలుడు శబ్దం వినిపించడంతో కుట్రకోణం ఉందనే అనుమానంతో అధికారులు దీనిపై విచారణ చేపట్టాలని మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికల నేపథ్యంలో లబ్ధిపొందేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసి ఉంటాయనే అనుమానాలు వినిపించాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
మేడిగడ్డ వద్ద ఒక పిల్లర్ మాత్రమే కుంగిందని అటు ఇంజినీరింగ్ అధికారులు చెప్తున్నా.. స్వయానా కాంట్రాక్టర్ అయిన వెంకట్రెడ్డి మరో రెండు బరాజ్లు కూలిపోతాయని ముందస్తుగా ఎలా చెప్తున్నారని అనుమానం కలుగుతున్నది. మరో రెండు బరాజ్లు కొట్టుకుపోతాయని కాంగ్రెస్ నేతకు ఎలా తెలుసని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రగా ప్రజలు అనుమానిస్తున్నారు.