హైదరాబాద్, జులై 1(నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రముఖ ఆలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యుల నియామకం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. చైర్మన్, సభ్యుల నియామకంపై సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ నేతలను పక్కనపెట్టి ఎక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం జిల్లా నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా నియమించడంపై మరింతగా మండిపడుతున్నారు.
ఇప్పటికే ఈ అంశంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తంచేశారు. తాజాగా ఆయనకు ఏకంగా టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ జత కలిశారు. యాదాద్రి బోర్డు ఏర్పాటుతో మరోసారి అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ వివాదం తెరపైకి వచ్చింది. పదవుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సీనియర్ నేతలను, సొంత పార్టీ నేతలను పక్కనబెట్టి.. ఎవరికో పదవులు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు.
ఏ ప్రాతిపదికన బోర్డు సభ్యులను నియమించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయ ట్రస్టు బోర్డును ఏర్పాటుచేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎంఎస్ఎన్ రెడ్డిని చైర్మన్గా మరో 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటుచేసింది. చైర్మన్గా ఎంఎస్ఎన్రెడ్డితోపాటు నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖను, మాజీ మంత్రి దేవేందర్గౌడ్ కుమారుడు విజయేందర్గౌడ్ను సభ్యులుగా నియమించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీంతో పాటు ఆలయం ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలకు తెలియకుండానే బోర్డు ఏర్పాటు చేయడం మరో వివాదంగా మారింది.
‘యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అంతా ఏకపక్షం. నా నియోజకవర్గమైన మునుగోడు ఆలయం ఉన్న యాదాద్రి జిల్లాలోకే వస్తుంది. అయినా కనీసం నన్ను సంప్రదించలేదు’ అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ యూట్యూబ్ చానల్తో లైవ్ ఫోన్కాల్లో మాట్లాడారు. ట్రస్ట్ బోర్డు నియామకంపై ఏకపక్ష నిర్ణయం సరికాదని, తనను అడిగితే తన నియోజకవర్గం నుంచి ఒక మెంబర్నైనా ప్రతిపాదించేవాడినని, తనలాంటి వారిని సంప్రదించకుండా ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో అంతా కొత్త వాళ్లదే హవా నడుస్తున్నదని, అసలు కాంగ్రెస్ వారు ఎక్కడ? అంటూ నర్మగర్భ విమర్శలు గుప్పించారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లు, ఒరిజినల్గా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లందరూ పార్టీలో రోజురోజుకూ కనుమరుగు అవుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో అందరూ సీనియర్ నేతలే ఉన్నారు కానీ, పార్టీని ఎట్లా నడుపాలో తెల్వదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయకుండా, షో ఆఫ్ చేస్తే ఎలా అని సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తేనే ప్రజలకు నచ్చుతుందని హితవు పలికారు. ‘నాకు నచ్చకనే నల్లగొండ మీటింగ్కు పోలే. సీఎం, మంత్రుల వ్యవహారశైలి అస్సలు బాలేదు. నాకు నచ్చడమే లేదు’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యుల నియామకంపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. పార్టీ అనుకొంటున్నారా? లేక సొంత కంపెనీ అనుకొంటున్నారా? అంటూ సీఎం రేవంత్రెడ్డి వైఖరిపై మండిపడుతున్నారు. పార్టీకి సంబంధంలేని వారిని నియమించడంపై భగ్గుమంటున్నారు. ఏకపక్ష నిర్ణయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తొలి నుంచి కూడా సీఎం సొంత పార్టీ నేతలకు అన్యాయం చేసేలా వివాదాస్పద నిర్ణయాలే తీసుకొంటున్నారని మండిపడుతున్నారు.
యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ సమర్థించడం సంచలనంగా మారింది. బుధవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా బోర్డు సభ్యుల నియామకం జరిగినట్టు తెలిపారు. అయితే సీఎం రేవంత్రెడ్డి ముందుగా ఆ జిల్లా నేతలతో చర్చించాలనే అంశంపై తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డులో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని నియమించడమేమిటని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రశ్నించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఇటీవల తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరైన కొణిదెల సురేఖను గుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించడమేమిటని ప్రశ్నించారు. ఆంధ్రా పాలకుల చేతిలో సీఎం పావులా ఉన్నట్టు తాజా ఘటనతో మరోమారు స్పష్టమైందని పేర్కొన్నారు.
ఆత్మగౌరవం కోసం కొట్లాడి సాధించిన తెలంగాణ.. మళ్లీ ఆంధ్రా పాలకుల చేతిలోకి వెళ్లిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆధ్యాత్మిక సేవలు చేసే వారిని ట్రస్ట్ బోర్డులో నియమించాల్సి ఉంటుందని, కానీ సీఎం రేవంత్రెడ్డి ఇందుకు భిన్నంగా వ్యాపారులకు అవకాశం కల్పించారని మండిపడ్డారు. ట్రస్ట్ బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆరుగురిని సభ్యులుగా ఎన్నుకొనే ఆనవాయితీ కొనసాగుతున్నదని, వెంటనే బోర్డులో ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురిని తీసుకోవాలని, అందులో యాదగిరిగుట్టకు చెందిన ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.