Bandi Sanjay | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిందే బండిసంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తొలిగించగానే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చానని తెలిపారు. బండిని అందరూ గుండెల్లో పెట్టుకోవాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కాస్తా బండి సంజయ్ వీడ్కోలు సభగా మారిపోయింది. సభ ఆద్యంతం బండి నామస్మరణతో నిండిపోయింది. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సైతం బండి నామస్మరణ చేశారు.
బండి సంజయ్ పాదయాత్రల వల్లే బీజేపీకి ఆదరణ పెరిగిందని, ప్రధాని మోదీ మూడుసార్లు బండిని పొగిడారని తెలిపారు. పదవి నుంచి తొలిగించిన తర్వాత తన దగ్గరికి వచ్చి గంటన్నర సేపు బాధపడ్డారని చెప్పారు. పార్టీలో మంచి పదవి వస్తుందంటూ ఊరడించే ప్రయత్నం చేశారు. ఇతర నేతలు కూడా బండి సంజయ్ గురించే ఎక్కువగా మాట్లాడటంతో కిషన్రెడ్డి ముఖం మాడిపోయింది. కిషన్ సన్మాన సభనో, బండి వీడ్కోలు సభనో అర్థం కావడం లేదంటూ కిషన్రెడ్డి అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు.
సొంత పార్టీ నేతలే తనను వెన్నుపోటు పొడిచారని బండి సంజయ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. పదవి నుంచి దిగిపోయేదాకా తనను ప్రశాంతంగా ఉండనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కనీసం కిషన్రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనీయండి. ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం ఆపండి’ అని సూచించారు. పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు, నేతల కోసం పనిచేయాలని కోరారు. సొంత ప్రయోజనాల కోసం, పదవుల కోసం ఆరాటపడుతున్న నేతలకు పరోక్షంగా పంచ్లు వేశారు. పక్కాగా ఈ వ్యాఖ్యలు ఈటల రాజేందర్ను ఉద్దేశించి చేసినవేనని బండి వర్గం నేతలు చెప్పుకొంటున్నారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేసింది, బండి పదవి పోయేదాకా విశ్వ ప్రయత్నాలు చేసింది, పార్టీలోకి రాగానే పదవుల కోసం ఆరాటపడింది ఈటలనే అని గుర్తు చేస్తున్నారు. అందుకే బండి సంజయ్ బహిరంగంగానే ఈటల రాజేందర్ను విమర్శించినట్టు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఈటల రాజేందర్ ముఖం చిన్నబోయిందని పేర్కొంటున్నారు.