Minister Komatireddy | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. పదవులు, రేవంత్రెడ్డి ప్రాపకం పొందేందుకే కేసీఆర్పై కోమటిరెడ్డి కారుకూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్లో ఈడిగ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మంత్రులు మూర్ఖుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ర్టానికి ఏం చేస్తారో చెప్పకుండా కేసీఆర్ను తిట్టడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సూటుబూటు కోటు వేసుకుని వికృతంగా మాట్లాడితే గౌరవం రాదని, ఆయన కోమటిరెడ్డి కాదు.. కారుకూతలరెడ్డి అని దుయ్యబట్టారు. రేవంత్రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ త్యాగాలకు సరిరారని చెప్పారు. ఇంతకాలం రాజకీయ బేతాళురుగా ఉన్న కాంగ్రెస్ నేతలకు కాలం కలిసొచ్చి గాలికి మంత్రి పదవులు రావడంతో తట్టుకోలేని ఆనందంలో బూతులు మాట్లాడుతున్నారని అన్నారు.
మొన్నటి వరకు రేవంత్రెడ్డి అంటేనే ఒంటిపై చీమలు పాకినట్టు ప్రవర్తించిన కోమటిరెడ్డి.. ఇప్పుడు ఆయన భజన చేస్తున్నారని విమర్శించారు. మాణి క్కం ఠాగూర్కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీ సీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడని రేవంత్రెడ్డిని తిట్టిన కోమటిరెడ్డి.. ఇప్పుడు పదవుల కోసం రేవంత్రెడ్డి కాళ్ల దగ్గర చేరాడని తూర్పారబట్టారు. పదేండ్ల కేసీఆర్ పాలనపై పోస్టుమార్టం చేసుకుంటూ కూర్చుంటే వచ్చేదేదీ లేదని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్పై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని, రాష్ట్ర ప్రజానీకానికి బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముం దు కోమటిరెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి, వాటిని అమలు చేయలేక ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ కాలం గడపాలనుకుంటే ఎన్నికల గండం అనేది ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని తుంగ బాలు హితవు పలికారు.