హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీకి కోవర్ట్గా పనిచేశానని స్వయంగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు నమ్మడం లేదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి వైపే ఉన్నారని స్పష్టం చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో బీజేపీకి బలం లేదని తేల్చిచెప్పారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి బీజేపీ నాయకులు హల్చల్ చేస్తున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ధనబలంతో గెలవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. గొర్రెలు కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమచేయకుండా బీజేపీ నాయకులు అడ్డుకొన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఏడుగురు టీఆర్ఎస్ సభ్యులు ఉంటే ముగ్గురు బీసీలేనని వివరించారు. బీసీల పట్ల కేసీఆర్కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనమని చెప్పారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్రెడ్డిని 2018లో గెలిపించి తప్పు చేశామని భావిస్తున్నారని, ఆ తప్పును సరిచేసుకొనే అవకాశం ఇప్పుడు వచ్చిందంటున్నారని పేర్కొన్నారు. మోదీ బీసీ అయినా ఓబీసీ మంత్రిత్వ శాఖ లేదని, దీనిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.