Komatireddy Venkat Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం మరోమారు ‘చేయి’చ్చింది. కీలక కమిటీల్లో ఇప్పటికే చోటు దక్కక నారాజ్లో ఉన్న ఆయనకు మళ్లీ షాకిచ్చింది. తాజాగా, ఎన్నికలకు సంబంధించి కొత్తగా 8 కమిటీలు వేయగా ఒక్కదాంట్లోనూ ఆయనకు స్థానం లభించలేదు. కీలకమైన ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, మ్యానిఫెస్టో కమిటీలకు మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబును చైర్మన్గా నియమించిన అధిష్ఠానం.. ఈ కమిటీల్లో సభ్యుడిగా కూడా కోమటిరెడ్డికి స్థానం కల్పించలేదు. దీంతో ఆయన అలకబూనినట్టు తెలుస్తున్నది. అధిష్ఠానం ఇటీవల ఏర్పాటు చేసిన ఏ కమిటీలోనూ ఆయనకు స్థానం దక్కలేదు.
ముఖ్యంగా ప్రాధాన్యం కలిగిన సీడబ్ల్యూసీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీల్లో ఆయనకు చోటు కల్పించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు తెలిసింది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నప్పటికీ ఒక్క భేటీకి మాత్రమే పరిమితమయ్యారు. రెండు రోజుల క్రితం రాష్ర్టానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. కోమటిరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. అయినప్పటికీ ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల్లోనూ మళ్లీ మొండిచేయి చూపించడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు తెలిసింది.