Zaffergadh | ఓరుగల్లు పేరు చెప్పగానే కాకతీయుల నిర్మాణాలైన వేయి స్తంభాల దేవాలయం, రామప్పగుడి, వరంగల్ కోట స్మృతిపథంలో కదలాడుతాయి. నవాబుల కాలంలోనూ ఓరుగల్లు ప్రాంతం వైభవోపేత నిర్మాణాలకు వేదికైంది. ఆ ఘనతకు సాక్ష్యాలుగా నిలిచే అద్భుత కట్టడాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. అందులో ఒకటి.. జనగామ జిల్లా జఫర్గఢ్ ఖిల్లా. జాగీర్దారుల నుంచి కప్పం వసూలు చేసేందుకు వచ్చిన సర్దార్ జాఫరుద్దౌలా.. ఈ బృహన్నిర్మాణానికి కారకుడు. కాబట్టే, ఒకనాటి వేల్పుగొండ జఫర్గఢ్గా పేరుగాంచింది.
అటు ఓరుగల్లుకు, ఇటు కొత్తగా ఆవిర్భవించిన జనగామ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల సమాన దూరంలో ఉంది చారిత్రక జఫర్గఢ్ కోట. అంతెత్తు కొండపై 1853లో నిర్మించిన ఈ కోట ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇక్కడ సర్వమత సమభావనకు ప్రతీకలు అనేకం. ఆలయాలు, మసీదులు, అబ్బురపరిచే శిల్పాలు, రణన్నినాదాన్ని వినిపించే ఫిరంగులు, కొండచుట్టూ శత్రు దుర్భేద్యమైన ప్రహరీ, లోతైన కందకాలు.. ఇవన్నీ జఫర్గఢ్కు వన్నె తెచ్చేవే. అప్పట్లో నిజాముల అధీనంలో ఉండేదీ వేల్పుగొండ.
ప్రజల నుంచి వసూలు చేసిన కప్పాన్ని (శిస్తు) రాజుకు పంపడం జాగీర్దారు బాధ్యత. ఓసారి ఆ సొమ్ము అందకపోవడంతో నాలుగో నిజాం నాసిరుద్దౌలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సమీప బంధువు, సైన్యాధికారి అయిన జాఫరుద్దౌలాను వేల్పుగొండకు పంపాడు. మందీమార్బలంతో వచ్చి జాగీర్దార్ల మెడలు వంచి బకాయిలు వసూలుచేశాడు జాఫరుద్దౌలా. ఆ తర్వాత తూర్పు, పడమటి కొండల మధ్య పచ్చగా కళకళలాడుతున్న ఈ ప్రాంతంలో ఓ కోట కూడా నిర్మించుకున్నాడు. అలా వేల్పుగొండ కాస్తా జఫర్గఢ్గా మారింది. రెండు కొండల్ని కలుపుతూ విస్తరించిన కోటలో అడుగడుగునా సరస్సులు, బావులు కనిపిస్తాయి. విశాలమైన రాతిగోడలు, వాటిపైన ఇటుక డంగుసున్నపు నిర్మాణాలు, ఎత్తయిన రాతి దర్వాజాలు, గోడల్ని మలిచి రూపొందించిన గవాక్షాలు.. కోట వైభవాన్ని చాటుతాయి.
పరమత సహనాన్ని చాటేలా జఫర్గఢ్ కోటలో పలు నిర్మాణాలు చేశాడు జాఫర్. ఆలయాలు, మసీదులు కట్టించాడు. వైష్ణవ, శైవ ఆలయాలతోపాటు.. కొండ వెనుక భాగంలో కొండ సింగమయ్య గుడి ఉంది. అవన్నీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. కోట పరిసరాల్లో తులశంబావి, భోగంబావి అనే జలవనరులు ఉన్నాయి. ఒకటి పూజాదికాలకు, మరొకటి రాచస్త్రీల స్నానాలకు ఉపయోగించే వారని అంటారు. ఎత్తయిన కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇప్పటికీ ఇక్కడ నిత్యపూజలు జరుగుతాయి. ఈ కొండపై దేవునిగుండం ఉంది. రాతిపై ఉన్న ఈ నీటిమడుగు ఎప్పుడూ ఎండిపోలేదని స్థానికులు చెబుతారు. ఇక్కడే రాతిపై తొలిచిన నరసింహస్వామి పాదాలు కనిపిస్తాయి. పరిసరాలలోని వివిధ కోనేర్లు సుజలాలతో కళకళలాడుతున్నాయి. పుష్కలమైన నీటి వనరుల కారణంగా నిత్యం పచ్చదనంతో అలరారుతూ కనువిందు చేస్తుంది జఫర్గఢ్ ఖిల్లా.
రెండు కొండల మధ్య ఉన్న గ్రామాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచాడు జఫర్. శత్రువుల దాడులను అడ్డుకునేందుకు మూడువైపులా పెద్దపెద్ద ద్వారాలు కట్టించాడు. వాటి దిక్కునుబట్టి హన్మకొండ దర్వాజ, పట్నం దర్వాజ, ఖమ్మం దర్వాజ అని పిలుస్తారు. గ్రామం చుట్టూ కందకాలు తవ్వించారు. కోట గోడలపై బతేరాలు నిర్మించి ఫిరంగులు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలోని బమ్మెర, పాలకుర్తి, వల్మిడి, పెంబర్తి, ఖిలాషాపురం, జఫర్గఢ్ను టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖకు రూ.55 కోట్ల నిధులు మంజూరు చేశారు. కోటలోని రెండు గుట్టలను కలుపుతూ పర్వతారోహణకు ఏర్పాట్లు చేయాలన్నది సర్కారు ప్రతిపాదన. ఇవన్నీ త్వరలోనే కార్యరూపం ధరించ బోతున్నాయి.
…? ఎన్.ఆర్.అనిల్కుమార్, ఫొటోలు : స్వర్గం చంద్రశేఖర్
“Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్ను అలవాటు చేశారు !!”