Telangana | రంగారెడ్డి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మొన్న ఫ్రెంచ్ దిగ్గజం మోనిన్ యాజమాన్యం.. నిన్న బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, నేడు వెల్స్పన్ చైర్మన్ బీకే గోయెంకా.. అందరి మాటా ఒక్కటే.. ‘తెలంగాణ పారిశ్రామిక విధానాలు అద్భుతం’. ఐటీ, ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్.. పరిశ్రమ ఏదైనా పుష్కలమైన అవకాశాలు.. అవును.. వెల్స్పన్ ఇంటర్నేషనల్ చైర్మన్ బీకే గోయెంకా కూడా తెలంగాణ పారిశ్రామిక విధానానికి ఫిదా అయ్యారు. ఎంతలా అంటే.. గుజరాత్, కర్ణాటకలో పెట్టాలని ఎప్పుడో నిర్ణయమైన కంపెనీ పెట్టుబడులను కూడా తెలంగాణకు తరలించుకొచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా బీకే గోయెంకానే వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందన్వెల్లిలో వెల్స్పన్ గ్రూప్ నిర్మిస్తున్న సింటెక్స్ బీఏపీఎల్ అత్యాధునిక యూనిట్కు గోయెంకాతో కలిసి మంత్రి కేటీఆర్ గురువారం భూమిపూజ నిర్వహించారు. అదే మండలంలోని సీతారాంపూర్లో కిటెక్స్ సంస్థ ఏర్పాటుచేయనున్న ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పారెల్ యూనిట్కు కూడా శంకుస్థాపన చేశారు. చందన్వెల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో గోయెంకా మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ పుష్కలమైన ఆదాయాలు పొందుతున్నాయని చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక విధానానికి ముగ్ధులమై అదనంగా రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
చందన్వెల్లిలో వెల్స్పన్ సిటీ
హైదరాబాద్ చుట్టూ అద్భుతమైన విద్యాసంస్థలు, నాణ్యమైన మానవ వనరులు ఉండటం తమ వ్యాపారానికి ఎంతగానో ఉపయోగపడనున్నదని గోయెంకా తెలిపారు. ‘వచ్చే ఐదేండ్లలో చందన్వెల్లిలో మరో వెల్స్పన్ నగరాన్ని నిర్మిస్తాం. ఇందులో పూర్తిస్థాయి ఫ్లోరింగ్, అత్యాధునిక టెక్స్టైల్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులతోపాటు భవన నిర్మాణానికి అవసరమైన ప్రతి ఒక్కటీ లభిస్తుంది. మా కంపెనీ ఇప్పటికే 500 మందికి ఇక్కడ ఉద్యోగాలిచ్చింది. చందన్వెల్లి చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో నాణ్యమైన విద్యాసంస్థలున్నాయి. ఇక్కడ అత్యాధునిక నైపుణ్యాలున్న కొత్త మానవ వనరులకు కొదవలేదు. చందన్వెల్లికి 45 నిమిషాల ప్రయాణ దూరంలోనే రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఒక గంట ప్రయాణ దూరంలోనే హైదరాబాద్ ఉన్నది. దీంతో ఇక్కడి యూనిట్ మాకు అతిపెద్ద బ్యాక్ ఆఫీస్ కాబోతున్నది. వచ్చే ఏడేండ్లలో 50 వేలమందికి ఉద్యోగాలిస్తాం. భవిష్యత్తులో చందన్వెల్లి పరిశ్రమలకు స్వర్గధామం అవుతుంది’ అని అన్నారు.
కేటీఆర్ ఓ మోటివేటర్
తెలంగాణ మంత్రి కే తారకరామారావుకు దేశంలోని ఏ రాష్ట్ర మంత్రి కూడా సాటి రాలేరని గోయెంకా అన్నారు. కేటీఆర్ను ఒక్కసారి కలిసి మాట్లాడినా ఎంతో ప్రేరణ పొందుతామని చెప్పారు. కేటీఆర్ వల్లే తాము గుజరాత్, కర్ణాటక రాష్ర్టాలను కాదనుకొని తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టామని తెలిపారు. ‘ఇక్కడి రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ, పారిశ్రామిక రంగంలో మాత్రం దేశంలోని ఏ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రితో పోల్చినా కేటీఆర్ అందనంత ఎత్తులో ఉంటారు. తెలంగాణలోని పారిశ్రామిక వాతావరణం మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. ఈ ఘనత మొత్తం రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన కేటీఆర్కే దక్కుతుంది. మేం ఫ్లోరింగ్ ప్లాంటును మొదట గుజరాత్లో పెట్టాలని అనుకొన్నాం. కానీ, 2018లో దావోస్లో మంత్రి కేటీఆర్తో సమావేశమైన తర్వాత తెలంగాణకు వచ్చాం. సింటెక్స్ ప్లాంటును కూడా కర్ణాటకలో పెట్టాలని మొదట నిర్ణయించాం. కానీ, కేటీఆర్తో చర్చించిన తర్వాత దానిని కూడా తెలంగాణకే తరలించాం. గత మూడేండ్లలో కేటీఆర్ మా కంపెనీ నిర్వహించిన మూడు కార్యక్రమాలకు విచ్చేశారు. ఆయన రాక మాలో ఎంతో ప్రేరణ నింపింది. తెలంగాణలో పారిశ్రామిక వృద్ధిపై కేటీఆర్ ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఇది నిరూపిస్తున్నది. మంత్రి కేటీఆర్తో గతంలో మేం సమావేశమైనప్పుడు తెలంగాణలో రూ.1200 కోట్లు పెట్టబడి పెడుతామని మాట ఇచ్చాం. ఇప్పటికే అంతకుమించి పెట్టుబడులు పెట్టాం. వీటితోపాటు మరో రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాం. మా పెట్టుబడులతో తెలంగాణలో ప్రత్యక్షంగా 20 వేలమందికి, పరోక్షంగా 30 వేలమందికి ఉపాధి లభిస్తుంది’ అని గోయెంకా వివరించారు.
వచ్చే ఏడాదిలో కిటెక్స్ యూనిట్
కిటెక్స్ సంస్థ ఇప్పటికే తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భారీ తయారీ యూనిట్ నిర్మిస్తున్నదని, డిసెంబర్ నాటికి అది అందుబాటులోకి వస్తుందని కేటీఆర్ చెప్పారు. సీతారాంపూర్లో కిటెక్స్ 1,200 కోట్లతో రెండో యూనిట్ను ఏర్పాటు చేస్తున్నదని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఒక్కరోజులో 7 లక్షల దుస్తులను ఉత్పత్తి చేసేలా యూనిట్ తయారవుతున్నదని వెల్లడించారు. అత్యధిక దుస్తులను ఉత్ప త్తి చేసే ప్లాంట్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రం అవతరించనున్నదని పే ర్కొన్నారు. తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుండటం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అదృష్టమని అన్నారు. మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్, శేరిలింగంపల్లిలో ఐటీ, రాజేంద్రనగర్లో ఐటీ, టూరి జం, చేవెళ్లలో మ్యాన్యుఫాక్చరింగ్, వికారాబాద్లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, తాండూర్లో ఇండస్ట్రియల్ పార్క్.. ఇలా భారీ గా పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. చందన్వెల్లి, చేవెళ్లలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, కిటెక్స్ చైర్మన్ సాబు జాకబ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఏసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చందన్వెల్లి, సీతారాంపూర్కు ప్రపంచ గుర్తింపు
దేశ, విదేశీ పెట్టుబడిదారులు వస్తుండడంతో షాబాద్ మండలంలోని చందన్వెల్లి, సీతారాంపూర్ గ్రామాల పేర్లు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రెండు గ్రామాలు పారిశ్రామిక ఖిల్లాలుగా ప్రపంచ చిత్రపటంలో చోటు సంపాదిస్తాయని చెప్పారు. ఇండ్లల్లో నీటి నిల్వకోసం వినియోగించే సింటెక్స్ ట్యాంకులు చందన్వెల్లిలో తయారై అనేక దేశాలకు ఎగుమతి కానున్నాయని తెలిపారు. తెలంగాణలో వెల్స్పన్ పెట్టుబడులు, అభివృద్ధి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రూ.350 కోట్ల పెట్టుబడితో వాటర్ ట్యాంకులు, పీవీసీ పైపుల తయారీ యూనిట్ను ఏర్పాటుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో వెల్స్పన్ వరల్డ్ కంపెనీ, సింటెక్స్ బీఏపీఎల్ లిమిటెడ్ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నాయి.
కేసీఆర్ దార్శనికతవల్లే ఇంతటి ప్రగతి
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లే తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి అద్భుతంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. చందన్వెల్లి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారులను సంతోషంగా ఉంచాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, దీనివల్లే ఐటీ, లాజిస్టిక్స్, ఫార్మా తదితర రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు తెలంగాణను ఎంచుకొంటున్నాయని పేర్కొన్నారు.
గుజరాత్, కర్ణాటకకు వెళ్లాల్సిన పెట్టుబడులు కూడా తెలంగాణకు రావటానికి సీఎం సమర్థ నాయకత్వమే కారణమని కొనియాడారు. పెట్టుబడిదారులకు రాబోయే రోజుల్లోను మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని, ఆ తర్వాత తామే వచ్చి కిటెక్స్, సింటెక్స్ కంపెనీలను ప్రారంభిస్తామని చెప్పారు.
1200 కోట్లతో కిటెక్స్ యూనిట్-2
రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో కిటెక్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న రెండో యూనిట్కు గురువారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందిస్తున్న కిటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ జాకబ్. చిత్రంలో ఎంపీ రంజిత్రెడ్డి తదితరులు