ములుగు, మార్చి 8 (నమస్తే తెలంగాణ)/ హనుమకొండ చౌరస్తా/వరంగల్: సమ్మక్క-సారక్క కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరం నుంచి బీఏ ఇంగ్లిష్, బీఏ సోషల్సైన్స్ విభాగంలో రెండు కోర్సులతో తరగతులను ప్రారంభిస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. సమ్మక్క-సారక్క కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయ క్యాంపస్ను శుక్రవారం ఆయన ములుగు జిల్లా జాకారంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో భూమిని అప్పగించిన తర్వాత డీపీఆర్ సిద్ధం చేసి వర్సిటీ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. యూనివర్సిటీలో 35% సీట్లు ప్రత్యేకంగా గిరిజన విద్యార్థుల కోసం కేటాయించామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. టూరిజం హబ్గా ఉన్న ములుగు జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారనున్నదని తెలిపారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఏర్పాటుకు బీఆర్ఎస్ పదేండ్లుగా ఎంతో కృషి చేసిందని వివరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ పీ శబరీష్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, యూనివర్సిటీ ఓఎస్డీ వంశీకృష్ణారెడ్డి, ఎగ్జామినేషన్ కంట్రోలర్ పోరిక తుకారాం పాల్గొన్నారు.
వెయ్యేండ్లు ఉండేలా వేయిస్తంభాల కల్యాణ మండపాన్ని నిర్మించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల కల్యాణమండపాన్ని ఎంపీ పసునూరి దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన పునఃప్రారంభించారు. కుటుంబసమేతంగా రుద్రేశ్వరునికి ప్రత్యేకపూజలు చేసి, శివపార్వతుల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. వేయిస్తంభాల గుడికి యునెసో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కల్యాణ మండపాన్ని నిర్మించిన శిల్ప కళాకారుతో పాటు స్థపతి శివకుమార్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, నంది విగ్రహాన్ని రూపొందించిన శిల్పులను సన్మానించారు. ఏఎస్సై ఉద్యోగులను సత్కరించారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆర్కియాలజీ అధికారులపై సీరియస్ అయ్యారు. వేదికపై కిషన్రెడ్డి మాట్లాడకముందే ఆర్కియాలజీ అధికారి మల్లేశం ‘ఓట్ ఆఫ్ థ్యాంక్స్’ చెప్పాలని మైక్లో అనడంతో మంత్రితోపాటు అక్కడే ఉన్న బీజేపీ నాయకులు మండిపడ్డారు. దీంతో తేరుకున్న సదరు అధికారి ఎలాంటి ప్రొటోకాల్ పాటించకుండా ఇప్పుడు పసునూరి దయాకర్, ఎంపీ మాట్లాడాలని అనడంతో అక్కడున్నవారు మరోసారి సీరియస్ అయ్యారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శుక్రవారం హనుమకొండలోని మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఇంటికి వెళ్లి బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. దీనిపై సీతారాంనాయక్ స్పందిస్తూ.. కిషన్రెడ్డి తన ఇంటికి రావడం సంతోషంగా ఉన్నదని, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడే మహిళా ప్రజాప్రతినిధులకు అగౌరవం ఎదురైంది. గిరిజనవర్సిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకంపై ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎంపీతోపాటు మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పేర్లను నమోదు చేయకపోవడం విమర్శలకు దారితీసింది. దీనిపై ఎంపీ కవిత ప్రారంభోత్సవ వేదికపైనే విచారం వ్యక్తంచేశారు. యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ను అధికారులు పాటించలేదని, శిలాఫలకంపై తన పేరుతోపాటు జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ, ఎంపీపీల పేర్లను నమోదుచేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
అధికారికంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలలో సైతం తన ఫొటోను ముద్రించకపోవడం సరికాదని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణారెడ్డి కల్పించుకొని యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న తమకు ప్రొటోకాల్ విషయాలు తెలియవని కారణంగా పొరపాటు జరిగిందని, రెండు మూడు రోజుల్లో ప్రొటోకాల్ ప్రకారం శిలఫలకాన్ని మారుస్తామని హామీ ఇచ్చారు.