హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. హామీలను నెరవేర్చే స్థితిలో ఆ పార్టీ లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన గ్యారంటీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. గ్యారంటీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ తెలంగాణకు ఏమొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ఆరు గ్యారంటీలను ఎక్కడ అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ హామీల అమలుపై లేదని విమర్శించారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పదికిపైగా ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని, మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రోజురోజుకు కనుమరుగవుతున్నదని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతున్నదని తెలిపారు.