హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. సొంత రాష్ట్రంపై, రైతులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఇబ్బంది పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రయాస పడుతుంటే కేంద్రం రైతులను కష్టాల్లోకి నెట్టే ప్రయ త్నం చేస్తున్నది. నష్టం భరించేందుకు సిద్ధమై ధాన్యం కొంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష గట్టింది. కిషన్రెడ్డి తన బాధ్యత మరిచి రాష్ట్రంపై అడ్డగోలు నిందలు వేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మొండికేసిందని, ఏర్పాట్లు చేయలేదని, గోనె సంచులు లేవని, మిల్లుల్లో ధాన్యం మాయమైందంటూ.. నోటికి హద్దు, అదుపు లేకుండా అభాండాలు వేశారు. అసలు
వాస్తవాలను పరిశీలిస్తే..
కిషన్రెడ్డి మాట: మిల్లుల్లో ధాన్యం మాయమైంది. ఎఫ్సీఐ తనిఖీల్లో 4,53,896 ధాన్యం సంచులు తక్కువగా వచ్చాయి. దీనిపై రాష్ట్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
వాస్తవం: గత యాసంగి, ఈ ఏడాది వానకాలం సీజన్లకు సంబంధించిన ధాన్యంపై ఎఫ్సీఐ గత నెల మిల్లుల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో మొత్తం 40 మిల్లుల్లో 4,53,896 ధాన్యం సంచులు లెక్కలోకి రాలేదని తేల్చింది. గత రెండు సీజన్లలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం 1.62 కోట్ల టన్నులు. ఇందుకు ఉపయోగించిన గన్నీ సంచులు 40.63 కోట్లు. అంటే మొత్తం 40.63 కోట్ల సంచుల్లో లెక్కలోకి రానివి కేవలం 4,53,896 మాత్రమే.
లెక్కలోకి రాని సంచుల్లోని ధాన్యం 18,155 టన్నులే. వానలకు ధాన్యం సంచులు తడవడం వల్ల, ఇతర వృధాల వల్లే సంచుల్లో లెక్క తప్పింది. దీనికి తోడు బియ్యం నాణ్యంగా లేవంటూ ఎఫ్సీఐ సుమారు 3వేల ఏసీకే (ఒక ఏసీకే 290 క్వింటాళ్లు)లను తిరస్కరించింది. మిల్లర్లు ఈ బియ్యా న్ని బయట విక్రయించుకొని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నాణ్యమైన బియ్యాన్ని ఎఫ్సీఐకి పెట్టనున్నారు. అదేవిధంగా సీఎమ్మార్లో కొన్ని రకాల్లో 67 కిలోల బియ్యం వస్తుంది. మరికొన్ని రకాల్లో రాదు. దీనివల్ల కూడా ధాన్యం సంచుల్లో లెక్క తప్పుతుంది. ఇలాంటి వాస్తవ, క్షేత్రస్థాయి ఇబ్బందులను దాచిపెట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై, అటు మిల్లర్లపై కిషన్రెడ్డి ఆరోపణలు చేయడం విడ్డూరం.
కిషన్రెడ్డి మాట: గోనె సంచులు లేవు. ధాన్యం ఎలా కొంటారు?
వాస్తవం: ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ విషయం మరిచిన కిషన్రెడ్డి.. తప్పు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆరోపించారు. జనవరిలోనే గోనె సంచుల కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం రాష్ర్టానికి గోనె సంచులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పుడేమో అసలు రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదని కిషన్రెడ్డి చెప్పడం గమనార్హం. కేంద్రం సహకరించకపోయినా కొనుగోలుకు అవసరమైన 4 కోట్ల సంచులను పౌరసరఫరాల శాఖ సేకరించింది. ఈ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది.
కిషన్రెడ్డి మాట: ధాన్యం కొనుగోలుకు రాష్ట్రం మొండికేసింది.
వాస్తవం: యాసంగిలో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేది బాయిల్డ్ రైస్ అయితే రా రైస్ కావాలంటూ మొండికేసింది కేంద్రం కాదా? రా రైస్ ఇస్తేనే ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇస్తామన్నది కేంద్రం కాదా? రైతుల కష్టాలను పట్టించుకోకుండా కేంద్రం మొండికేస్తే, రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో నష్టాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రూ.3 వేల కోట్ల నష్టాన్ని భరించి ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. పైగా ధాన్యం కొనుగోలుకు రాష్ట్రం మొండికేసిందంటూ మరో తప్పుడు ప్రచారానికి పూనుకొన్నారు.