భువనగిరి: వరి కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 రోజులుగా రైతుల ధాన్యం కేంద్రాల్లోనే మొలకలొస్తుంటే రేవంత్ సర్కారుకు ఏ మాత్రం సిగ్గనిపిస్తలేదా అని ఫైరయ్యారు. రైతులపై కాంగ్రెస్ బస్మాసుర హస్తంగా మారిందన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతోపాటు రేవన్నపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 20 రోజులైనా కాంగ్రెస్ సర్కారు ధాన్యం కొంటలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్కు ఆయన ఫోన్ చేశారు. అయితే స్విచ్ ఆఫ్ రావడంతో అడిషనల్ కలెక్టర్తో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆగ్రహం
వ్యక్తం చేశారు.
‘ట్రాన్స్పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్, హమాలి చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుంది. సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్ ఇస్తున్నది. రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుంది. రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బంది ఏంటి?’ అని నిలదీశారు. స్థానిక అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే అంత చులకనా.. అంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం వస్తే అందరు పరిగెత్తుతారు.. ఇదేనా రైతంటే ఈ ప్రభుత్వానికి గౌరవం అంటూ ఫైరయ్యారు.
25 రోజులుగా రైతుల ధాన్యం కేంద్రాల్లోనే మొలకలొస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సిగ్గనిపిస్తలేదా అన్నారు. రైతులపై కాంగ్రెస్ బస్మాసుర హస్తంగా మారిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ప్రభుత్వం ధాన్యం కాంటా చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారని విమర్శించారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. ధాన్యం దళారుల పాల్జేసుకుని నష్టపోవడమే రైతులకు దిక్కా అంటూ మందలించారు.