మెదక్, నమస్తే తెలంగాణ: చిన్న వయస్సులో పెద్ద ఆలోచనతో అన్నా, చెల్లెలు అందరి మన్ననలు పొందుతున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్కు చెందిన రాజు, నర్సమ్మ దంపతులు. వీరు హైదరాబాద్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరికి యశ్వంత్, దీపిక ఇద్దరు సంతానం. తల్లిదండ్రులిద్దరూ నగరంలో ఉంటున్నా పిల్లలు మాత్రం హవేళీఘనపూర్లోనే చదువుకుంటున్నారు.
ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో వారు తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వినూత్న ఆలోచన చేశారు. గతంలో తమ తండ్రి వినియోగించిన ఆటో ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో ఆటో టాప్ను తీసివేసి దానిని మొబైల్ నిమ్మరసం బండిగా మార్చేశారు. రోడ్డు పక్కనే వాహనాన్ని నిలిపి జ్యూస్ విక్రయిస్తూ సంపాదిస్తున్నారు. ఈ పిల్లల ఆలోచనను స్థానికులు అభినందిస్తున్నారు.