మేడ్చల్, జనవరి17 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ చరిత్ర సృష్టిస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తున్న దేశ ప్రజలంతా కేసీఆర్ నాయకత్వా న్ని కోరుకుంటున్నారని తెలిపారు. దేశం చూపంతా ఖమ్మం సభవైపే ఉన్నదని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ సభకు తరలివచ్చేందుకు ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు.
ఖమ్మం సభపై దేశమంతా చర్చ జరగాలి
ఖమ్మంలో బుధవారం జరిగే బీఆర్ఎస్ బహిరంగసభపై దేశమంతా చర్చ జరుగాలని, ఆ బాధ్యత పార్టీ సోషల్ మీడియా సభ్యులదేనని రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి తెలిపారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ పాలన గురించి దేశమంతా చర్చ నడుస్తున్నదని.. సభ ఉద్దేశం, బీఆర్ఎస్ లక్ష్యాలను ప్రతి గ్రామానికి చేర్చాలని పేర్కొన్నారు. దేశంలో అధికారమే పరమావధిగా నడుస్తున్న రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు జరుగుతున్న ఈ యజ్ఞంలో పాల్గొనేందుకు పలువురు సీఎంలు, జాతీయ నేతలు, మేధావులు రావడం సంతోషకరమని అన్నారు.