V. Hanumantha Rao | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డిని సీఎం చేయాలని గతంలో అన్నందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తనపై పగ సాధిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆరోపించారు. గతంలో తాను భట్టికి చేసిన మేలును మరిచి ద్రోహంచేయడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మం టికెట్ తనకే ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరేందుకు ఆదివారం ఢిల్లీకి వచ్చిన వీహెచ్ మీడియాతో మాట్లడుతూ.. తనకు టికెట్ రాకుండా భట్టి అడ్డుకుంటున్నారని కంటతడి పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి బీసీ నాయకులు అవసరం లేదు కానీ వారి ఓట్లు కావాలా? అని ప్రశ్నించారు.
భట్టి విక్రమార్క ప్రస్తుతం ఈ స్థాయికి రావడానికి కారణం తానేనని, ఆయనకు మొదట ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించింది తానేనని చెప్పారు. ఖమ్మం టికెట్ స్థానానికులకే ఇవ్వాలనే వాదన తెరపైకి తెస్తున్నారని, గతంలో ఇక్కడినుంచి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహించిన రేణుకాచౌదరి, పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కర్రావు స్థానికులా? అని ప్రశ్నించారు. తాను ఇప్పటికీ రన్నింగ్ రేసులో కూడా పాల్గొంటానని తెలిపారు. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ తప్ప ఇంకెవరు పోటీచేసినా తాను బరి నుంచి తప్పుకునేది లేదని హెచ్చరించారు. తన శవంపై పార్టీ జెండా కప్పాల్సిందే కానీ పార్టీ మారే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. రాహుల్, సోనియాగాంధీ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉన్నదని, తమ కుటుంబం నుంచి తాను ఒక్కడినే రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు.