హైదరాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్రకు సంబంధించిన పనులు పూర్తికావస్తున్నాయి. ప్రస్తుతం ట్రాలీపై వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. తుది పూజల అనంతరం గణనాథుడిని ట్రాలీపైకి ఎక్కించనున్నారు. ఇప్పటికే త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ట్రాలీపైకి చేర్చారు. కాగా, సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్ మహాగణపతిని తరలించేందుకు ఈ ఏడాది అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు.
67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. 50 అడుగుల ఎత్తు, 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర ఖైరాతాబాద్ సెన్షెన్ థియేటర్, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్ భవన్, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ట్యాంక్బండ్పైకి మొత్తం 2.5 కిలోమీటర్లు సాగుతుంది. మధ్యాహ్నం 3 గంటలలోపే నిమజ్జనం పూర్తికానుంది.
క్రేన్ నం.4 వద్దే నిమజ్జనం
ప్రతి ఏడాది మాదిరి ఖైరతాబాద్ గణేశుడిని ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నం.4 వద్దే నిమజ్జనం చేస్తారు. మోడ్రన్ కంపెనీకి చెందిన ఈ క్రేన్ వంద టన్నుల బరువును సునాయసంగా ఎత్తుతుంది.