హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలతో చర్చించారు. అలాగే.. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై సీఎం ఎంపీలతో చర్చించారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై కేసీఆర్ చర్చించారు. కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ఆ నివేదికను సీఎం కేసీఆర్ ఎంపీలకు అందజేశారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఈసందర్భంగా సీఎం కేసీఆర్.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్లో వాణి బలంగా వినిపించాలని ఎంపీలకు సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గట్టిగా పోరాడండి. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు. చట్టపరంగా, న్యాయపరంగా రావాల్సినవి కూడా రాలేదు.. అని సీఎం.. ఎంపీలతో వ్యాఖ్యానించారు.
కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత దానికి అనుగుణంగా మేము స్పందిస్తాం. కేంద్రం దృష్టికి సీఎం ఇప్పటికే పలు అంశాలు తీసుకెళ్లారు. 23 అంశాలతో కూడిన నివేదికను సీఎం ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలపై ఎక్కువగా దృష్టి సారిస్తాం.. అని ఎంపీ రంజిత్ రెడ్డి వెల్లడించారు.