హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : ఎవరైనా తాము పుట్టిన తేదీనే బర్త్డే జరుపుకొంటారు. ఆ తర్వాత చేసుకోరు.. ఒకవేళ చేసుకుంటే అందరూ నవ్విపోతారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీరు కూడా అచ్చం అలాగే ఉన్నది. తెలంగాణ పుట్టిన రోజు.. అదే ఆవిర్భవించింది జూన్ 2న. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జూన్ 5న ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించింది. అది కూడా బీజేపీకి అవకాశం కల్పించి. ఇలాంటి తలతిక్క నిర్ణయాలతో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు నకిలీ కాంగ్రెస్ నేతలు.. బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీజేపీని ఆకాశానికెత్తి.. కాంగ్రెస్కు సమాధి కడుతున్నారని అసలు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఇలాంటి వాటితో కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగడం ఖాయమని, అసలు కాంగ్రెస్ నేతలు మదనపడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు. దేశ రాజధానిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేంద్ర బిందువు. ఈ భవన్ కేంద్రంగానే తెలంగాణ బిడ్డలు అక్కడ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ భవన్లో ప్రభుత్వం ఘనంగా ఆవిర్భావ వేడుకలను నిర్వహించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మంగళవారం ఆవిర్భావ వేడుకలను తూతుమంత్రంగా నిర్వహించింది. పైగా ఈ వేడుకలకు కూడా అగ్రనేతలు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ఏఐసీసీ నేతలు ఒక్కరు కూడా హాజరుకాలేదు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్గోయల్, సిబ్బంది మినహా ఎవరూ లేరు. జూన్ 5న ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ భవన్లో వేడుకలను నిర్వహించనున్నది. జూన్ 2 వర్కింగ్ డే కావడంతో నిర్వహించలేదని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరి జూన్ 5న శుక్రవారం వర్కింగ్డే కావడం గమనార్హం. మొత్తంగా సర్కార్ పెద్దలు పొంతనలేని సమాధానాలతో తమ పరువును తామే తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ప్రభుత్వ భవనమైన ఢిల్లీ తెలంగాణ భవన్లో బీజేపీ మంగళవారం రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించింది. అంబేద్కర్ హాల్లో నిర్వహించిన వేడుకలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్, కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావులు హాజరయ్యారు. వాస్తవానికి ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం ఇదే తొలిసారి. పైగా ప్రభుత్వ భవనంలో నిర్వహించడం గమనార్హం. ఒక పార్టీ అది కూడా కాంగ్రెస్ను వ్యతిరేకించే పార్టీ కార్యక్రమానికి అనుమతలెలా వచ్చాయి?. ఎవరు అనుమతులిచ్చారని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లోని ఓ వర్గం లోపాయికారిగా బీజేపీకి సహకరిస్తుందని, రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని భావించి కమలం కండువాను మోసేందుకు సిద్ధమవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ర్టావతరణ వేడుకలు నిర్వహించకుండా జూన్5కు వాయిదా వేయడం, మంగళవారం బీజేపీకి వేడుకలను నిర్వహించే అవకాశమివ్వడే దీనికి నిదర్శనమంటున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఢిల్లీలో బీజేపీ ఆవిర్భావ వేడుకలని, అందుకు కాంగ్రెస్ సహకారం ఫిక్సింగ్లా అనిపిస్తున్నదని తెలంగాణవాదులంటున్నారు.