హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెసోడు ఏం తెచ్చిండు? ‘ఒక్కసీటు తెచ్చుకో నువ్ మొగోనివైతే’ అన్నడు. ‘ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపిచ్చుకుందాం’ అని జవహర్నగర్కు చెందిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్త కేతమ్మ పోరుకేక పెట్టింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కమంత్రికీ తీరికలేదా మందలియ్య?’ అని నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తున్నదని ప్రశ్నించింది. బుధవారం తెలంగాణభవన్లో మల్కాజిగిరి పార్లమెంట్ ని యోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రు లు తలసాని శ్రీనివాస్యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు మల్లేశం, వాణీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతమ్మ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. సమావేశంలో కేతమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే..
బూటు కాలు చూపిస్తున్నరు!
జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై కేటీఆర్.. జై మల్లారెడ్డి. తెలంగాణల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఎట్లున్నది? ఆనాడు ఎట్లున్నది? నాయినా, ఇయ్యా ల కాంగ్రెస్ పార్టీ వాళ్లు మసిపూసి మారేడు కాయచేసి, కండ్లకు గంతలు కట్టి ఆరు పథకాల హమీలు ఇచ్చి గద్దెకెక్కిరి. ఓటేసినంక బూటుకాలు చూపిస్తున్నరు. ఇయ్యాల 24 గంటలు మేడిబాయి, ఆలుగడ్డబాయి అంటూ తిరుగుతున్నరు. రైతులను పట్టించుకుంటలేరు. రైతులకు సాగునీళ్లు లెవ్వు, తాగునీళ్లు లెవ్వు. కేసీఆర్ పదేండ్లు ప్రజలను పదిలంగా కాపాడుకున్నరు. ప్రజలమందరం పదిలంగా ఉన్నం. కేసీఆర్, కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేశారు. జై తెలంగాణ అన్నరు. జైలు కూడుతిన్నరు. లాఠీ దెబ్బలు తిన్నరు. జై తెలంగాణ నినాదాలు చేసిర్రు. ఆనాడు బీజేపోళ్లు వచ్చి జెండాలేపిర్రా? కాంగ్రెసోళ్లు వచ్చి జెండాలేపిర్రా? ఏనాడూ వారు జై తెలంగాణ అనలే.
గెల్వంగనే కాంగ్రెస్ పత్తాకు లేకపాయె
తెలంగాణల పదేండ్లు కేసీఆర్ తాగునీళ్లు, సాగునీళ్లు, హరితహారం, అమ్మఒడి, ఆశావర్కర్లు, కంటివెలుగు, రెండువేల పింఛన్ ఇస్తే.. గెల్వంగనే నాలుగువేల పింఛన్ ఇత్త అన్నవ్. డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ అన్నవ్. ఏదీ రుణమాఫీ? కేసీఆర్ గెలిచినంక 2.8 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు నీళ్లు లేక, నిధుల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. పొలాలను అడ్డికి పావుసేరు అమ్ముకున్నరు. దేశాలు పట్టిర్రు. బొంబాయి కూలికి పోయిండ్రు. కేసీఆర్ తెలంగాణ తెచ్చినంక కొన్ని కోట్లు పెట్టినా ఎకరం భూమి దొరుకుతలేదు.
ఒక్కమంత్రికీ తీరికలేదా?
ఒక్కొక్క రైతు ఐదారు బోర్లు ఎస్కుంటున్నరట. ఐదారు లక్షలు అవుతున్నయట. నెర్రబట్టిన పొలాలను చూసి రైతులు మళ్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఇప్పటికే 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. అంతమంది ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరూ పోలే. మళ్లా ఇప్పుడు కేటీఆర్ తిరుగుతుండు. హరీశ్రావు తిరుగుతుండు. అటుచేసి ఇటుచేసి రైతుల కోసం పాట్లుపడేది మన తెలంగాణ బిడ్డలు రామన్న, హరీశన్న మాత్రమే.
ఎన్నిబాధలయ్యా? ఎన్ని కష్టాలయ్యా?
కాంగ్రెసోళ్లు వచ్చినంక కల్యాణలక్ష్మిపాయె, షాదీముబారక్పాయె, కేసీఆర్ కిట్టుపాయె. రెండు లక్షలు పాయె. ఏం బస్సు ఎక్కితే ఎంత? ఎక్కకుంటే ఎంత? కాంగ్రెసోడు ఏంతెచ్చిండు? ఒక్క బస్సు తెచ్చిండు! ఆరు పథకాలల్ల ఒక్కటీ కాలే. మల్కాజిగిరి ప్రజలారా.. నల్లగొండ కావచ్చు, హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఖమ్మం ఎక్కడైనా సరే ఎంపీగా నిలబడితే కారు గుర్తుకు ఓటేపిద్దాం. వెనక్కు తగ్గేదిలే. నాదీ నీది అనుకోవద్దు. మనకు పగలొద్దు, కష్టపడదాం. ఒక్కటి కాదు ప్రతీ ఎంపీని గెలిపించుకుందాం. కేసీఆర్కు గిఫ్టుగా ఇద్దాం. అయ్యా, అమ్మా, నా రైతన్నలారా ఇప్పటికే మీరు తప్పిదారి చెయ్యికి ఓటేసి మీరు తోడుకున్న గోతిల మీరే పడ్డరు. ఇప్పటికైనా కండ్లు తెరుచుకోండి. కండ్లుతెరచి కారు గుర్తుకు ఓటెయ్యండి. జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై కేటీఆర్.. జై మల్లారెడ్డి.