దేవరుప్పుల, మార్చి 30: నీళ్లుండీ ఇవ్వలేని పాలకులను నిలదీసి రైతులకు తానున్నానంటూ భరోసా ఇవ్వడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం రైతుల చెంతకు వస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని చింతబాయి తండా వద్ద ఎండిన రైతుల వరి చేన్ల వద్దకు కేసీఆర్ రానున్న సందర్భంగా శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి ముందస్తుగా పర్యటించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదివారం ఉదయం ధరావత్ తండా పరిధిలోని చింత బావితండా, పచ్చర్లబావి తండా పరిధిలో ఎండిన పొలాలను పరిశీలిస్తారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో రెండు కార్లు చెరువులు నింపామని, వాగుల్లో చెక్డ్యాంలు పారించినట్టు చెప్పారు. కేవలం కాంగ్రెస్ పాలకుల చేతకాని తనం వల్లే రైతులకు సాగు నీరు చేరలేదని, ఈ విషయంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులతో నేరుగా మాట్లాడుతారని తెలిపారు. మార్పు కోరిన రైతులు పంటలను మాడ్చుకున్నారని, ఇకనైనా పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ను గెలిపిస్తే పాత రోజులు వస్తాయని చెప్పారు.