సిద్దిపేట అర్బన్, జనవరి 9: కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించడంతోపాటు మంజూరు చేసిన నిధులకు సం బంధించి పనులు పూర్తిచేసేలా కాంగ్రెస్ ప్రభు త్వం చొరవ చూపాలని సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను ప్రస్తుత ప్రభు త్వం కొనసాగించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.
రైతుబంధు, రైతు రుణమాఫీ పథకాలను వెంటనే అమలు చేయడంతోపాటు జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయాలని, దళితబంధు, గృహలక్ష్మి, రెండో విడత గొర్రెల పంపిణీ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, బీఆర్ఎస్ సభ్యులు ప్రతిపాదించగా సభ ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మంజూరైన బీసీబంధు చెక్కులను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని, రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావడం లేదని ఓ సభ్యుడు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఫిబ్రవరి వరకు రైతుబంధు వేసిందని చెప్పడంతో.. బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.20, రూ.30 తమ ప్రభుత్వం ఏనాడూ వేయలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎందుకు చేయలేదని సభ్యులు నిలదీశారు. దీంతో కాసేపు సభలో వాగ్వాదం, గందరగోళం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో ఉచిత బస్సు పథకం తప్ప ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. రాబోయే రోజుల్లో ఎలా అమలు చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.