రోజుకో వెరైటీ. అయితే చట్నీ.. లేదంటే సాంబార్. మెనూలో మిల్లెట్స్.. అన్నిరకాల పోషకాల సమ్మేళనం. బడి ప్రారంభానికి ముందే వేడివేడిగా వడ్డింపు. ఇది ప్రతిష్ఠాత్మక సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అమలుకు విద్యాశాఖ తయారుచేసిన ప్రతిపాదిత మెనూ. ఉప్మా, కిచిడి, పొంగల్ వంటివీ ఇందులో చేర్చి ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అక్టోబర్ 24న దసరా కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 వేలకుపైగా బడుల్లో ప్రారంభిస్తారు. 23 లక్షలకుపైగా విద్యార్థులు లబ్ధి చేకూరనున్నది.
CM Breakfast | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయకుండా, మాడల్ స్కూళ్లు, మదర్సాలు, ఎయిడెడ్ పాఠశాల్లోనూ అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ స్కూళ్లు 642, మాడల్ స్కూళ్లు 194, మదర్సాలు 100 ఉన్నాయి. వీటిల్లో 1.50 లక్షలకుపైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. విద్యార్థులకు ఇప్పటికే నాణ్యమైన విద్యనందిస్తున్న రాష్ట్రప్రభుత్వం.. మానవీయకోణంలో పోషకాహారాన్ని అందించేందుకు ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఉదయాన్నే విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలన్న సంకల్పంతో అల్పాహార పథకాన్ని అమలుచేయనున్నది.
విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పెంచటం, కూలి పనుల చేసుకునే తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదన్న ద్విముఖ వ్యుహాంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నది. సన్నబియ్యం, రాగిజావ, మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు/అరటిపండు.. పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో స్నాక్స్ను అందజేస్తుండగా, తాజాగా సుపోషణలో భాగంగా బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయనున్నది.