BRS | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గులాబీ శ్రేణులు ఉద్యమకాలం నాటి ఉద్వేగానికి లోనవుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ తమలో తిరిగి నూతనోత్సాహాన్ని నింపుతున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయాలనుకుంటున్న కుట్రలతో అయోమయంలో పడిన క్యాడర్కు రెండు బహిరంగ సభలు ధైర్యాన్నిచ్చాయని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న చేవెళ్ల, 16న సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలను నిర్వహించింది. ఈ రెండు చోట్లా కేసీఆర్ చేసిన ప్రసంగాలు పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశానికి దారి చూపిందని పార్టీ నాయకులు చెప్తున్నారు. వాస్తవానికి చేవెళ్ల, జహీరాబాద్.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు. కానీ, సిట్టింగ్ ఎంపీలు ఒకరు కాంగ్రెస్లోకి (రంజిత్రెడ్డి), ఇంకొకరు బీజేపీలోకి (బీబీపాటిల్) మారి.. ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో సభలు నిర్వహించటం సాధారణ రాజకీయ పార్టీలకు సవాలే. కానీ, బీఆర్ఎస్ అసాధారణ రాజకీయ పార్టీ అని మరోసారి నిరూపించిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్, బీజేపీకి దీటైన సమాధానం
రెండు బహిరంగ సభలతో కాంగ్రెస్, బీజేపీకి కేసీఆర్ దిమ్మతిరిగే సమాధానం చెప్పారని బీఆర్ఎస్ కీలకనేత తెలిపారు. గులాబీ పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించటం ఎవరి వల్ల కాదని ఈ సభలు నిరూపించాయని వెల్లడించారు. అధికారం లేకున్నా తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారని, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ ముందు జాతీయ పార్టీలు చిత్తు అవుతాయని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్, బీజేపీ బద్ధశత్రువులని కేసీఆర్ తనదైన శైలిలో వివరించటం వల్ల గులాబీ శ్రేణులు కన్విన్స్ అయ్యాయని, అందుకే సభలకు విశేష స్పందన లభించిందని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
నేడు అభ్యర్థులు,పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం తెలంగాణ భవన్లో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు పాల్గొ నే ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్లు అందజేయనున్నారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా తాను చేపట్టే బస్సు యాత్ర రూట్మ్యాప్పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.