హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ‘ఎర్రటి ఎండల్లో గులాబీ పరిమళం.. తెలంగాణ అంతటా కేసీఆర్ ప్రభంజనం’ అన్నట్టుగా సాగుతున్నది రాష్ట్రంలో కేసీఆర్ బస్సుయాత్ర. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గతనెల 24 చేపట్టిన బస్సుయాత్ర ప్రభావం రాష్ట్రమంతా కనిపిస్తున్నది. ఈ బస్సుయాత్ర ఇంకా నాలుగు రోజులే కొనసాగనున్నది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఇక తమకు ఎదురేలేదని కాంగ్రెస్ భ్రమపడింది. దేశమంతా తమ ఛత్రం తీసుకున్నాం.. ఇన్నాళ్లు బీఆర్ఎస్ గొడుగు కింద ఉన్న తెలంగాణను అతి సులువుగా తమ ఆధీనంలోకి తీసుకొవచ్చని బీజేపీ తలచింది. కానీ, రాష్ట్రంలో కేసీఆర్ రోడ్షోలకు హాజరవుతున్న ప్రభం‘జనం’తో ఆ రెండు పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి.
తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ను వేరు చేయలేమని రెండు పార్టీలు అర్థం చేసుకున్నాయి. అందుకు కేసీఆర్ రోడ్షోలకు పోటెత్తుతున్న జనసునామీయే నిదర్శమని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు, ఆ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర నాయకులు చెప్పేమాటలకన్నా కేసీఆర్ చెప్పే విషయాలకే జనామోదం ఎక్కువగా ఉంటుందని ఇప్పుడే కాదు గతంలో అనేక పరిణామాలు స్పష్టం చేశాయని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మరోసారి అటువంటి వాతావరణాన్ని సృష్టించబోతున్నాయని తెలంగాణ మేధావులు తేల్చిచెప్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ముందు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, సామాజిక వాతావరణానికి, ప్రస్తుత పరిస్థితికి మధ్య అసలు పోలికేలేదని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ‘బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను మా వాళ్లు తక్కువగా అంచనావేశారు. వారికి ఉన్న రాజకీయ అనుభవం, పరిణతి కేసీఆర్ను మదింపు చేయలేవు’ అని కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గతనెల 24న మిర్యాలగూడ రోడ్షోలో కేసీఆర్ చేసిన ప్రసంగం నుంచి మొదలుకుంటే సోమవారంలో నిజామాబాద్ కేసీఆర్ రోడ్షో దాకా ఉత్తర, దక్షిణ తెలంగాణను కేసీఆర్ చుట్టివచ్చారు.
ఈ 13 రోజుల్లో మధ్యలో 48 గంటలు మినహా (స్థూలంగా జమ్మికుంట రోడ్షో మినహా) కేసీఆర్ చేసిన ప్రసంగాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకీభవిస్తున్నారని క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం చెప్తున్నది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు కేసీఆర్ ప్రభావాన్ని తగ్గించాలని కాంగ్రెస్ అగ్రనేత నేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున్ ఖర్గే.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా, జేపీ నడ్డాసహా అనేక మందిని తెలంగాణకు రప్పించి ప్రయోజనం పొందాలని చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించేలా కనిపించటంలేదని క్షేత్రస్థాయి వాతావరణం చెప్తున్నది.
బస్సుయాత్ర పొడవునా కేసీఆర్కు యువత నీరాజనం పలుకున్నది. చిన్నచిన్న గ్రామాల మొదలు మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో కేసీఆర్ను జనం కండ్లకు అద్దుకుంటున్నారు. ఆడబిడ్డలు బస్సు ముందు మంగళహారతులు పడుతున్నారు. గ్రామపెద్దలు గుమ్మడికాయలతో కేసీఆర్కు దిష్టితీసే దృశ్యాలు ఊరూరా దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ రోడ్షో నిర్దేశిత ప్రాంతానికి చేరుకునే రెండు గంటల ముందు నుంచే యువత హంగామా చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు అంతగా ఆసక్తిచూపని యువతలో మార్పు వచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో ఆ మేరకు ప్రభావం చూపుతుందని పేరు చెప్పటానికి నిరాకరించిన ఒక సామజికవేత్త విశ్లేషించారు.