KCR | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి, మీకు మేము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే, కేసీఆర్ మాత్రం రైతులకు మనోధైర్యం కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకు ఎన్నికల కన్నా రైతుల కన్నీళ్లు తుడవటమే అత్యంత ముఖ్యమని బీఆర్ఎస్ కార్యాచరణ నిరూపిస్తున్నదని ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమై, చిక్కిశల్యమైపోయిన వ్యవసాయాన్ని పదేండ్ల కఠోర శ్రమతో దరికి చేర్చిన బాధ్యతాయుతమైన పార్టీగా, ఆ పార్టీకి సారధ్యం వహిస్తున్న తెలంగాణ సాధకుడిగా.. కేసీఆర్ రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అందుకే జిల్లాల పర్యటన తలపెట్టారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే రైతు కేంద్రంగా తాము పోరుపతాక ఎగురవేస్తున్నామని గులాబీదళం స్పష్టం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలుపుకోని కారణంగానే రాష్ట్ర రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ తరుణంలో రైతులకు బాసటగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని నమ్మించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా హామీలను అమలు చేయకపోగా మరింత కుంగదీసే చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే రైతుల కోసం అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడంతోపాటు రైతులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
ఓవైపు సాగునీరు అందక ఎండుతున్న పంట లు.. మరోవైపు అకాల వర్షాలతో అల్లాడుతున్న రైతాంగం.. సకాలంలో అందని రైతుబంధు.. వీటికితోడు రైతులకు బ్యాంకుల నోటీసులు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టనష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు.. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల సమయం లో రైతుభరోసా కింద రైతులు, కౌలురైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడిసాయం, అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ తదితర హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను నల్లగొండ, కరీంనగర్ సభల్లో ఎలుగెత్తి చాటినప్పటికీ, ప్రభుత్వం స్పందించని కారణంగానే క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి వస్తున్నదని బీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు.
రైతన్న కోసం ద్విముఖ వ్యూహం
సమస్యల పరిష్కారంలో అధికారపక్షం విఫలమైనచోట ప్రతిపక్షాలు పోరుబాటను ఎంచుకోవడం సహజం. అందులో భాగంగానే రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వాన్ని మేల్కొల్పడం అనే ద్విముఖ వ్యూహాన్ని బీఆర్ఎస్ ఖరారు చే సింది. రైతులెవరూ ఆత్మహత్యల కు పాల్పడకూడదని, ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు రైతుల దగ్గరికి వెళ్లి వారికి మనోధైర్యాన్ని కల్పి స్తూ వేసిన పంటల విస్తీర్ణం, ఎండిన పంట విస్తీర్ణం, రైతుల స్థితిగతులను బేరీజు వేసి గ్రామాలు, మండలాలవారీగా తెలంగాణభవన్కు సమాచారం పంపిస్తే దానిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది.
31న కేసీఆర్ పర్యటించే జిల్లాలివే
నీళ్లందక ఎండిపోతున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అందులో భాగంగా ఈ నెల 31న జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటపొలాలను పరిశీలించి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటిస్తారు. అక్కడినుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అర్వపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా హాలియా మండలంలో పర్యటంచి రైతులకు మనోధైర్యం ఇవ్వనున్నారు.
ఎండిన చేలు.. రైతు దిగాలు
బోరు బావులు అడుగంటడంతో నీరందక పంట పొలాలు ఎండుతున్నాయి. పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని మరిగడి గ్రామంలో ఎండిన తన పొలాన్ని చూసి ఆవేదన చెందుతున్న రైతన్న.