సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కేంద్రంపై మొదటినుంచీ కన్నెర్ర
కేంద్రం తీరుపై ఎప్పటికప్పుడు గళం విప్పుతున్న ముఖ్యమంత్రి
తాజాగా జీఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుతో అదనపు బలం
హక్కుల కోసం బీజేపీయేతర రాష్ర్టాలను ఏకం చేసే అవకాశం
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల హక్కుల కోసం కేంద్రప్రభుత్వంపై చేసే పోరాటానికి సీఎం కేసీఆర్ నేతృత్వం వహించనున్నారా..? హక్కులను కాపాడుకునేందుకు, కోల్పోయిన వాటిని సాధించేందుకు బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆయన ఏకం చేయనున్నారా..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున జరుగుతున్న చర్చ ఇది. జాతీయస్థాయిలో జరుగుతున్న తాజా పరిణామాలు ఇవే సంకేతాలిస్తున్నాయి. సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కేసీఆర్ పలు సందర్భాల్లో బలంగా వ్యతిరేకించారు. రాష్ర్టాల స్వతంత్రతను కాపాడాలని, దేశ సమగ్రతను, ఫెడరల్ స్ఫూర్తిని పరిరక్షించాలని వివిధ వేదికలపై ఆయన బలంగా తన వాణిని వినిపించారు. తాజాగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రాష్ర్టాల హక్కుల కోసం పోరాడుతున్నవారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది.
కేంద్రం చేసిన జీఎస్టీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదని, రాష్ర్టాలు మార్చుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం కేసీఆర్కు అదనపు బలాన్ని చేకూర్చుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీయేతర రాష్ర్టాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా అనేక అంశాల్లో రాష్ర్టాల హక్కుల్ని కాపాడుకోవచ్చని కేసీఆర్ యోచిస్తున్నారని, ముఖ్యమంత్రి వివిధ రాష్ర్టాల పర్యటన ఆ కార్యాచరణ దిశగా పడుతున్న అడుగులుగానే భావించాలని వారు విశ్లేషిస్తున్నారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మొదటినుంచీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ‘వన్ నేషన్- వన్ పాలసీ’ పేరుతో రాష్ర్టాల స్వతంత్రతను దెబ్బతీస్తున్నది. అడ్డగోలుగా చట్టాలను తీసుకొస్తూ అనేక రంగాల్లో రాష్ర్టాల హక్కుల్ని హరిస్తున్నది. దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని ప్రవేశపెడుతున్నామనే పేరిట సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నది. కేంద్రం విధానాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ధిక్కారస్వరం వినిపిస్తూనే ఉన్నారు. రాష్ర్టాల స్వతంత్రతను, దేశ సమగ్రతను దెబ్బతీసే ధోరణులపై ఎప్పకటిప్పుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. కొత్తగా రాష్ట్రంగా ఏర్పడిన పసికూన తెలంగాణపై మొదటినుంచీ మోదీ ప్రభుత్వం పగబట్టినట్లే వ్యవహరిస్తున్నది. దీనికితోడు ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు ఇక్కడి ప్రజలను, వారి ఆహారపు అలవాట్లను అవమానించేలా మాట్లాడిన సందర్భాలున్నాయి. తెలంగాణపై విషం చిమ్మే ధోరణికి తోడు విధానపరమైన నిర్ణయాల్లోనూ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుండటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో తీవ్రంగా దుయ్యబట్టారు. వడ్ల కొనుగోలుపై ఏకంగా ఢిల్లీలోనే దీక్ష చేపట్టి, కేంద్రానికి తీవ్ర హెచ్చరికలు పంపారు.
సుప్రీం తీర్పుతో ‘బలం’
తాజాగా కేంద్రం చేసిన జీఎస్టీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదని, రాష్ర్టాలు మార్చుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం కేసీఆర్కు అదనపు బలాన్ని చేకూర్చుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ర్టాలు కోల్పోయిన హక్కులను తిరిగి సాధించేందుకు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ఇందుకోసం బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఏకం చేస్తారని అంటున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రభుత్వాలు కేంద్రం విధానాలపై నిరసన గళం వినిపిస్తున్నాయి. ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సీఎం కేసీఆర్కు సాన్నిహిత్యం ఉన్నది. ఇప్పటికే పలుమార్లు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఆయన చర్చలు జరిపారు. తాజాగా మరోసారి దేశవ్యాప్త పర్యటన చేపట్టిన కేసీఆర్.. ఢిల్లీ, చండీగఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్లో పర్యటించనున్నారు. ఇందులో బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో తాజా పరిణామాలపై చర్చించి, త్వరలో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రుణాల నిలిపివేత.. పరాకాష్ట
బడ్జెటేతర రుణాలను సైతం రాష్ట్ర అప్పుల్లో కలిపేస్తామంటూ కేంద్రం ఇటీవల రాష్ర్టాల నెత్తిన పిడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇది కేంద్రం నియంతృత్వ ధోరణికి పరాకాష్ట అని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కేవలం రాష్ర్టాల ఆర్థిక మూలాలను, అభివృద్ధిని దెబ్బతీసేందుకే కేంద్రం ఎవరినీ సంప్రదించకుండా హడావుడిగా ఈ నిర్ణయాన్ని ప్రకటించిందని, రాష్ర్టాలు నిధుల సేకరణ చేయకుండా అడ్డుకునేందుకే ఈ అడుగులని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీయేతర రాష్ర్టాలతో కలిసి కేంద్రంపై పోరాటం చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారని సమాచారం.
కేంద్రంపై ధిక్కార స్వరం
కేంద్రం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్తు, వ్యవసాయం, నీటిపారుదల తదితర రంగాలను తన గుప్పిట్లోకి తీసుకుంటున్నదని మోదీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటినుంచీ కన్నెర్ర చేస్తున్నారు. నూతన విద్యుత్తు విధానం, ఇటీవల రద్దు చేసిన మూడు నల్ల చట్టాలు, తెలుగు రాష్ర్టాల్లోని నదుల నిర్వహణనను తన చేతుల్లోకి తీసుకోవడం, రాష్ర్టాల అభిప్రాయం తీసుకోకుండానే ఏకపక్షంగా నదుల అనుసంధానానికి నిర్ణయించడం వంటి పరిణామాల్లో కేంద్ర తీరును సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. కేంద్రం దుర్మార్గ వైఖరిని ఎండగడుతూ ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు అనేకసార్లు లేఖలు రాశారు. ముఖ్యంగా చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ 5శాతం నుంచి 12 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించినప్పుడు ఏకంగా ఉద్యమం చేశారు. జీఎస్టీని ఎత్తివేయాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో బాయికాడ మీటర్లు పెట్టడం, ఏఐఎస్లను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు కేంద్రం ప్రయత్నించడం వంటి సందర్భాల్లో ఘాటు విమర్శలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఉపాధి హామీ, ఇతర పథకాలకు కేంద్రం నేరుగా నిధులను బదిలీ చేయడాన్ని సైతం తప్పుపట్టారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకం లేదా.?’ అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత, ఆర్థిక భద్రతను మాత్రమే చూసుకోవాలని, మిగతా రంగాలన్నింటినీ రాష్ర్టాలకే వదిలేయాలని సీఎం కేసీఆర్ బలంగా భావిస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో కేంద్రం ప్రమేయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వారు గుర్తుచేస్తున్నారు. స్థానిక అవసరాలు, బౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా విధానాలు అమలు చేసుకొనే అవకాశం ఆయా రాష్ర్టాలకు ఉండాలని కేసీఆర్ మొదటినుంచీ వాదిస్తున్నారు. ఈ దుష్ట సంప్రదాయాలకు చరమగీతం పాడేందుకు, మోదీ పాలనలో కునారిల్లుతున్న దేశాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలెక్కించేందుకు, దేశంలో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ప్రకటన చేశారు.