హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే వారికి ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంజారాహిల్స్లోని మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమానికి కొప్పుల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ఎవరూ విద్యకు దూరం కారాదని సీఎం కేసీఆర్ గురుకులాలను నెలకొల్పుతున్నారని వివరించారు. రాష్ట్రంలో 5 సొసైటీల ఆధ్వర్యంలోని 985 గురుకులాల్లో 6 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు పోషకాహారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, సొసైటీ అదనపు కార్యదర్శి దిలావర్ తదితరులు పాల్గొన్నారు.