KCR | మోదీ ప్రభుత్వ హయాంలో ఎవరికీ ఏం లాభం జరుగలేదని.. పెట్టుబడిదారులకు మాత్రం కాపలాకాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటూ గులాబీ దళపతి కేసీఆర్ విమర్శించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ అధినేత రోడ్షో నిర్వహించారు. కార్నర్ మీటింగ్లో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ‘కేసీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నయ్. ప్రధాని నరేంద్ర మోదీ పది సంవత్సరాల కిందట గద్దెనెక్కి 150 నినాదాలు ఇచ్చిండు. ఇందులో ఏ ఒక్క నినాదం కూడా నిజం కాలేదు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగినయ్.. సామాన్యుల నడ్డి విరిగింది తప్పా.. అచ్చేదిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే గ్యాస్. మేమేదో ఉద్దెరిస్తాం.. ఆరు చందమామలు పెడుతం.. ఏడు సూర్యులను పెడుతం. మళ్లీ మాకే గుద్దండి అంటున్నడు. నమ్మవచ్చునా? నమ్మే అవకాశం ఉందా? అంతా ట్రాషు.. గ్యాసు’ అంటూ విమర్శించారు.
‘ఎప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు. పాకిస్తాన్తో పంచాయితీ అని చెప్పుడు. పాకిస్తాన్ గింతంత బుట్క దేశం. జాడిచ్చి ఒక్కటి కొడితే 25ఏళ్లు మనదిక్కు చూడడు. వాణ్ణి చూపించి.. ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి.. ప్రతిసారి ఓట్లు అందుకునుడు.. మనకు గ్యాస్ చెప్పుడు. మోదీ ఎజెండాలో పేదల కష్టాలుండవ్. ధనికుల బాధలు మాత్రం ఉంటయ్. ట్యాక్స్లు మాఫీ చేస్తే అంబానీ, అదానీలకు, పెద్దపెద్ద కార్పొరేట్లకు రూ.15లక్షలు కోట్లు మాఫీ చేసిండు. కానీ, పబ్లిక్ సెక్టార్ కంపెనీలన్నీ ఒక్కొక్కటి నోట్లో బుక్క పెడుతున్నడు. చివరకు ఎల్ఐసీని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నడు. రైల్వేను కూడా ప్రైవేటుపరం చేస్తున్నడు. విమానాశ్రయాలు ప్రైవేటుపరం చేస్తున్నడు. ఓడరేవులు ప్రైవేటుపరం చేస్తున్నడు. మొత్తం పోతే.. మన యువత ఎక్కడికి వెళ్లాలి’ అంటూ ప్రశ్నించారు.
‘ఏం జరగాలి ఈ దేశం. ఒక్క నినాదం కరెక్ట్ లేదు. ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు. ఆ నిషాలో పోకుండా ప్రజలు విజ్ఞులు ఆలోచన చేయాలని కోరుతున్న. ఊరికే గుడ్డిగా ఓట్లు వేస్తే మన పిల్లల భవిష్యత్ పోతుంది. ఇప్పటికే దేశం పరువుపోయింది. అంతర్జాతీయంగా దెబ్బతిన్నం. ఏ ఒక్క వర్గానికి లాభం జరుగలేదు. పేదలు, గిరిజనులు, మహిళలు, కార్మికుల కోసం ఓ మంచి చట్టం లేదు. కనీస జీతాలు పెంచాలని చట్టాలు తేలేదు. కానీ పెట్టుబడిదారులకు మాత్రం కాపలాకాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం’ అంటూ ధ్వజమెత్తారు.