KCR | రాష్ట్రంలో కరెంటు స్విచ్ఛాప్ చేసినట్లుగా ఎందుకు మాయమైంది బీఆర్ఎస్ అధినేత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఈ పరిస్థితికి అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్ పార్టీ అసమర్థత తప్ప మరేం కారణం కాదు’ అన్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన ఆదివారం ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ అందరికి సమాచారం కోసం చెబుతున్నా. హైదరాబాద్కు పెట్టుబడులు, ఐటీరంగంలో పెట్టుబడులు వచ్చిన తర్వాత.. హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చాం. ఎలాంటి పరిస్థితిని తీసుకువచ్చామంటే.. ఐటీ కంపెనీలు, ఇంటర్నేషన్ దిగ్గజాలు సైతం న్యూయార్క్, లండన్లో పవర్ పోతుంది కానీ.. హైదరాబాద్లో పోదు అనే స్థితికి తీసుకువచ్చాం. స్టోరీలాగా చెప్పడం లేదు’ అన్నారు.
‘బీఆర్ఎస్ వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నేషనల్ గ్రిడ్కు మన రాష్ట్రం అనుసంధానం లేకుండే. వార్ధా-డిచ్పల్లి, వరంగల్-వరోరా, అంగుల్-పలాస, పీజీసీఐఎల్ వెంటపడి రాత్రింబళ్లు కష్టపడి మూడులైన్లు కలిపించాం. దాంతో తెలంగాణ, ఏపీ నేషనల్ పవర్గ్రిడ్కు అనుసంధానమయ్యాం. మనకు ఏదైనా సందర్భంలో షార్టేజ్ ఏర్పడితే ఇండియా మొత్తంలో ఎక్కడ పవర్ ఉన్నా కొనుక్కునే అవకాశాన్ని కల్పించగలిగాం. 7600 మెగావాట్ల స్థాపిత విద్యుత్ను 18వేల మెగావాట్లకు తీసుకెళ్లాం. 1600 రామగుండంలో, 4వేలు యాదాద్రి థర్మల్ స్టేషన్లో 5600 మెగావాట్ల పవర్ అడిషనల్గా వచ్చే సదుపాయం కల్పించాం. మొన్ననే ఎన్టీపీసీ 1600 మెగావాట్లను ప్రధాని స్వయంగా వచ్చి జాతికి అంకితం చేశారు. వాళ్ల వెంబడిపడి.. తరిమితరిమి దాన్ని చేయించాను. పదిసార్లు రామగుండం వెళ్లి మీకు ఏం కావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడిగి పనులు పూర్తి చేయించాం. మా ప్రభుత్వం పోయిన తర్వాత ప్రధాని ప్రారంభించారు. ఇప్పుడు ఆ సప్లయ్ అదనంగా వచ్చింది. 1600 మెగావాట్లలో 85శాతం అదనంగా వచ్చింది. ఎన్టీపీసీ ఏం చేస్తుందంటే.. ఏ రాష్ట్రంలో ఉందో.. దానికి 85శాతం ఇస్తుంది. 15 శాతం జాతీయ అవసరాల కోసం తీసుకుంటారు. ఆ ప్రకారంగా అద్భుతమైన కరెంటు 1500 మెగావాట్ల కరెంటు అదనంగా వస్తుంది’ అన్నారు.
‘ఈ ప్రభుత్వం పట్టించుకోని చేస్తలేదు కానీ.. యాదాద్రిలో ఒకటో రెండో యూనిట్లలో కరెంటు వచ్చేది. ఇందులో తెలంగాణకే.. బయటకు ఇచ్చే అవసరం ఉండదు. 1500-1600 మెగావాట్ల కరెంటు వస్తుండే. మరి ఇంత ఉజ్వలంగా తయారైన పవర్ సిస్టమ్ ఇవాళ ఇబ్బందిపడుతుంది. ఇది పరిపాలకుల అసమర్థత అవునా? కదా? మీరే ఆలోచన చేయాలి. పని చేయలేనటువంటి.. చేతగానటువంటి ప్రభుత్వ విధానమనుకోవాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. లేక దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు.. ఉండి దరిద్రం ఎందుకు? ఏ కారణం ? ఇంత అద్భుతమైన పవర్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది రాష్ట్రంలో. ఏడు సంవత్సరాలు నడిచిన సిస్టమ్.. అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ఛాప్ చేసినట్లుగా ఎందుకు మాయమైంది. దీనికి ఎవడు సమాధానం చెప్పాలి.. ఎవడు బాధ్యత వహించాలి. ఇది క్రాస్ టాక్ కాదు. ఏడు ఏడున్నరేళ్లు బ్రహ్మాండంగా నడిచిన సిస్టమ్ నడవడం లేదంటే ఎవరి అసమర్థత? ఎవరి వైఫల్యం’ అంటూ
‘వందకు వందశాతం నేను ఆరోపిస్తున్నా.. అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్ పార్టీ అసమర్థత. మరేం కాదు. వాళ్లకు తెలివిలేదు పాపం. పవర్ సిస్టమ్లో ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి టెక్నోక్రస్ట్ను పెట్టాం. వాళ్ల ఆధ్వర్యంలోనే నడిపాం. కాబట్టే సమర్థవంతంగా నడిచింది. వీళ్లు ఐఏఎస్ ఆఫీసర్లను తెచ్చిపెట్టారు. వానికి పట్టదు.. నా మంత్రులకు పట్టదు. తీరిక లేదు మంత్రులకు. రాజకీయాల కోసం తీరిక ఉన్నది కాని.. ప్రజల అవసరాల కోసం తీరిక లేదు. రైతుబంధు వేయడానికి తీరిక లేదు. మేం రైతుబంధు వేస్తే వారం పదిరోజుల్లోనే వేసేవాళ్లం. వీళ్లు అనుమానాలు కలిగించి.. ఐదెకరాలు, మూడెకరాలు.. ఏడెకరాలకు వేస్తమని.. ఏదో విజయం సాధించామని తోకమట్ట. అదేదో గొప్ప ఢంబాచారమని.. అదో వేస్ట్ పథకం అన్నట్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నరు. ఇది నాలుగో నెల. ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. ఇప్పుడు నా గొంతు విప్పుతున్నా. ఎవరైనా కొత్తగా గెలిస్తే సమయం ఇస్తాం. రెండు మూడు నాలుగు నెలలు సమయం ఇస్తం. వాళ్లు సర్దుకోవాలి. అవగాహన చేసుకోవాలి కదా. ఐదేళ్లు అద్భుతంగా నడిపాం. బ్రహ్మాండంగా మిషన్ భగీరథలో నీళ్లు ఇచ్చాం. రాలేదా? హైదరాబాద్ నగరంలో బయట గ్రామాల్లో ఒక్కనాడు ఒక్క ట్యాంకర్ కనిపించిందా? ఇవాళ ట్యాంకర్ కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ సమర్థులు ఎవరు. ఇవాళ ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కాదా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.