KCR | కాంగ్రెస్ పాలన రోజు రోజుకూ దిగజారి పోతోందని, ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజులు కాకు మునుపే ప్రజావ్యతిరేక మూటగట్టుకుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు అలవిగాని హామీలిచ్చి, గ్యారంటీల పేరుతో ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించిన కాంగ్రెస్ ఎన్నికల అనంతరం మాట మార్చిందన్నారు. తాము సమయంతో సహా ప్రకటించి, ప్రమాణపూర్వకంగా ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతుంటే.. సమాధానమివ్వడం చేతకాక నాలిక మడతేసి అబద్దాలకు బెదిరింపులకు దిగి తప్పించుకుంటుందని విమర్శించారు.
తెలంగాణ భవన్లో మంగళవారం మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రత్యర్థుల దుష్ప్రచారాలకు ప్రభావితమై తమకు మంచిచేసే బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రజల ఇట్లా తమకోసమే పని చేసే ప్రభుత్వాలను దూరం చేసుకున్న సందర్భాలు చరిత్రలో ఉన్నాయన్నారు. తాము మోసపోయిన సంగతిని గ్రహించి ఆ తర్వాత కొద్దికాలం లోనే వాస్తవాలను తెలుసుకుని తిరిగి ఆదరించారని అన్నారు.
ఇదే నేపథ్యంలో తాము గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు సాగునీరు కరెంటు వంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంతో తెలంగాణ ప్రజలు విస్మయం చెందుతున్నారన్నారు. తమకు కొత్తగా ఇచ్చే తెలివి లేకున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కొనసాగించలేక పాలనలోని డొల్ల తనాన్ని స్వయంగా కాంగ్రెస్ బయటేసుకుంటూ ప్రజల్లో అభాసుపాలవుతున్నదన్నారు. గెలుపు ఓటములు సహజమని ప్రజా క్షేత్రంలో ఉంటూ వారితో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని నాయకులకు స్పష్టం చేశారు.
నాటి ఉద్యమకాలం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పనిచేస్తున్నదని అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాదరణ పొందాలని పిలుపునిచ్చారు. తాను పాలమూరు ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని గుర్తు చేశారు. ఎంతో ఘనంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను పాలమూరులో అమలుచేసినామన్నారు. పాలమూరు నీటిగోసను తీర్చేందుకు , ఉద్యమ సారధిగా తాను చేసిన పోరాటాలను, నాటినుంచి కరువుకోరల్లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లాను బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన విధానాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు. నీళ్లు లేక సాగులేక నాడు బండలా ఉన్న పాలమూరును సస్యశ్యామలం చేసి పచ్చని పంటలతో ధాన్యరాసులతో బంగారి కొండలా అభివృద్ధి చేశామన్నారు.
నాటి కాంగ్రెస్ సహా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిలబడిపోయిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను అభివృద్ధి పనులను ఆటంకపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తిపోతల పథకం ద్వారానే కొడంగల్కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చని అట్లా కాకుండా ఉన్నదాన్ని తీసేసి కొడంగల్ లిఫ్ట్ను మార్చడం సరైన నిర్ణయం కాదన్నారు. ఇలా అనేక అనాలోచిత నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
చేసిన మేలునుమరిచి కేవలం తమ స్వార్థంతో పార్టీని వీడుతున్న వారిని పట్టించుకోనవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు’ అనే సుమతి శతకాన్ని ఉదహరించిన కేసీఆర్.. కష్టకాలంలో ప్రజలతో నిలిచినవారే నిజమైన ప్రజానాయకులన్నారు. పోయేవాళ్లగురుంచి ఆలోచించకుండా అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు. ‘కష్టకాలంలో వాళ్ల స్వార్థాన్ని వాళ్లు చూసుకుంటూ వెళ్లిపోతున్న అవకాశవాదులకు తిరిగి భవిష్యత్తులో సందివ్వకూడదు సార్’ అంటూ ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నేతలు చేసిన సూచనకు సానుకూలంగా స్పందించారు. అలాంటి వారిని తిరిగి ఆదరించబోమని స్పష్టం కేసీఆర్ స్పష్టం చేశారు.