KCR | కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ బండి సంజయ్తో పైసా అభివృద్ధి పని జరిగిందా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. ‘పోయినసారి మంచికో చెడ్డకో నలుగురు బీజేపీ ఎంపీలను గెలిచారు. నాలుగు రూపాయల పనైనా చేశారా? ఇక్కడ (కరీంనగర్) గెలిచిన బండి సంజయ్ మీకేమైనా పని చేసిండా..? ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంతా గ్యాసే కదా? ఎంతసేపు లొడలొడా మతం పిచ్చి.. అదోటి ఇదొటి మాట్లాడడం.. పంచాయితీలు పెట్టించు తప్ప ఎవరికేమైనా లాభం జరిగిందా? కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు నాతో కొట్లాడి రూ.2వేలకోట్లు తెచ్చి ప్రతి రోడ్డునూ బ్రహ్మాండం సుందరంగా తీర్చిదిద్దింది గంగుల కమకలార్’ అంటూ గుర్తు చేశారు.
‘అభివృద్ధి అంతా మీ కండ్ల ముందే జరిగింది కద. ఏ విధంగా కేబుల్ బ్రిడ్జి వచ్చింది. పట్టణం ఏవిధంగా అభివృద్ధి జరిగింది. కానీ, బండి సంజయ్ పైసా పని అయ్యిందా? ఒక్కనాడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? అసలు మాట్లాడవస్తదా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా.. ఇంగ్లీషా, తెలుగా.. తెలియక మనమే సావాలే. మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్లకు అర్థమవుతుందా? అలాంటి వ్యక్తిని మళ్లీ పార్లమెంట్కు పంపుదామా? అద్భుతమైన న్యాయవాది.. ఓ కమ్యూనిస్ట్ కుటుంబంలో ఉద్యమాల బిడ్డగా పుట్టి.. తెలంగాణ కోసం 2001 నుంచి నాతోటి ఉండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగనా పాలుపంచుకున్న వినోద్ను పంపుదామా? బండి సంజయ్ని పంపుదామా? దయచేసి కరీంనగర్ గడ్డ ఆలోచించాలి. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. రాష్ట్రం మనది. భవిష్యత్ మనది. మనం గుడ్డిగా ఓటువేస్తే దెబ్బతింటాం. ఇప్పటికే నష్టపోయాం.. దెబ్బతిన్నం. ఇంకా దెబ్బతినవద్దని కోరుతున్నా’నన్నారు.