ఇవాళ మన వనపర్తి పట్టణంలో బస్సులో నేను తిరుగుతూ ఉంటే అడిగినా.. ఈ రోడ్డు ఏమైంది.. ఆ రోడ్డు ఏమైంది..ఈ రోడ్డు పక్కన జాగా ఎంత ఉన్నదంటే రూ.5 కోట్లు, రూ.3 కోట్లు ధర ఉన్నదన్నరు. ఒకప్పుడు రూ.30 వేలు, రూ.3 లక్షలకు అమ్ముకొన్న వనపర్తిలో ఇవాళ రూ.3 కోట్లకు ఒక ఎకరమా! ఒక్క మెడికల్ కాలేజీ లేని పాలమూరులో ఐదు మెడికల్ కాలేజీలా! ఇదంతా ఎక్కడి నుంచి సాధ్యమైంది? ఎట్ల సాధ్యమైంది? మన భూముల ధరలు, మన 24 గంటల కరెంట్, మన సాగునీళ్లు, తాగునీళ్లు, ఎంత అద్భుతం!.. పట్టుబడితే, జట్టుకడితే, పిడికిలి బిగిస్తే.. ఏ తెలంగాణ కనబడుతున్నదో అట్ల నా భారతదేశం కూడ తయారు కావాలె.
ఈ కులం, మతం అనేది దరిద్రపు మాట. ప్రజలకు కొట్లాట పెడుతది. బుద్ధి తక్కువ పార్టీలు.. బుద్ధి తక్కువ వెధవలు.చిల్లర రాజకీయాల కోసం, స్వార్థం కోసం భరత జాతినే బలిపెట్టే విష ప్రయత్నాలు జరుగుతున్నయి. చైతన్యవంతులైన తెలంగాణ మేధావులు దాన్ని తిప్పికొట్టాలి. మతపిచ్చి భయంకరమైన క్యాన్సర్ వంటి వ్యాధి. అది మనకు రాకుండా చూసుకోవాలె. అప్రమత్తంగా ఉండాలి.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వాల్మీకి బోయలకు న్యాయం జరుగాలన్నా, గిరిజనులకు 10 రిజర్వేషన్ రావాలన్నా, రాష్ట్రం మరింత ముందుకుపోవాలన్నా.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని బంగాళాఖాతంలోకి ఇసిరెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. భరతజాతిని బలిపెట్టే క్యాన్సర్గా బీజేపీ మతపిచ్చిని ఆయన అభివర్ణించారు. ప్రజల డిమాండ్లను పట్టించుకోని మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. బంగారు తెలంగాణ మాదిరిగా బంగారు భారతదేశాన్ని తయారు చేస్తానన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ చిట్యాలలో నూతన వ్యవసాయ మార్కెట్యార్డును ప్రారంభించారు. వేరుశనగ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కర్నెతండా ఎత్తిపోతల పథకం, ప్రభుత్వ నూతన వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల భవనం, గొర్రెల పునరుత్పత్తి కేంద్ర నిర్మాణాల శిలాఫలకాలు ఆవిష్కరించారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు -మన బడి’ పైలాన్ ఆవిష్కరించారు. తర్వాత టీఆర్ఎస్ భవన్ను, నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. తర్వాత బహిరంగ సభలో సీఎం ప్రసంగం ఆయనమాటల్లోనే..
ఉమ్మడి రాష్ట్రంలో మేము పలుచబడ్డం.. ఇప్పుడు మా గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలె, 10% కావాలని అసెంబ్లీలో తీర్మానంచేసి పంపితే.. మోదీ దానిని తొక్కిపెట్టిండు. కేంద్రానికి ప్రజల డిమాండ్లు తెలువయి. ప్రజల ఆవేశం పట్టదు. మూర్ఖమైన మొండిపద్ధతిలో వ్యవహరిస్తున్న మోదీకి బుద్ధిచెప్పాలె. మన వాల్మీకి బోయలకు రిజర్వేషన్ కావాలన్నా, గిరిజనులకు 10% రిజర్వేషన్ రావాలన్నా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని బంగాళాఖాతంలోకి ఇసిరెయ్యాలె. ప్రజలకు మతపిచ్చి లేపి దేశాన్ని సర్వనాశనం చేసేవాళ్లకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ సిద్ధంగా ఉండాలె. మీరింత పెద్ద సంఖ్యలో కేసీఆర్ను దీవించాలని వచ్చినారు. వనపర్తిని, మీ చైతన్యాన్ని చూసి ఆనందం కలిగింది. ఇదే చైతన్యంతో పురోగమించి తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకొందాం. దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి భగవంతుడు ఇచ్చిన శక్తిని, యుక్తిని వినియోగిస్తా. మీరందరు నన్ను పొమ్మని దీవిస్తున్నరు కాబట్టి.. దేశ రాజకీయాలను చైతన్యపరిచి ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా మడమ తిప్పకుండా ముందుకు సాగి బంగారు భారతదేశాన్ని తయారుచేయడానికి పురోగమిద్దాం.పట్టుబడితే.. జట్టుకడితే.. న్యాయంకోసం పురోగమిస్తే.. ఇవాళ ఏ తెలంగాణ కనపడుతున్నదో అట్లా మొత్తం దేశం తయారు కావాలె. తెలంగాణ కోసం కొట్లాడినం.. తెచ్చుకున్నాం.. ఇవాళ నా తెలంగాణలో ఆకలి చావులు లేవు. ఆత్మహత్యలు లేవు. ఇగ కరువులు రావు. వలసలు ఉండయ్. మంది మన దగ్గర వచ్చి బతకాలె తప్ప మనం బతుకపోం. మన కరెంట్ పోదు. బ్రహ్మాండంగా ఉంటది.
ఈ మధ్య దేశంలో గోల్మాల్ గోవిందంగాళ్లు మోపయిండ్లు. దేశాన్ని ఆగం పట్టిస్తున్నరు. ప్రజలకు మత పిచ్చి, కులపిచ్చి లేపుతున్నరు. చైతన్యం ఉన్న గడ్డగా.. తెలంగాణ బిడ్డగా.. నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకం తెలంగాణలో కానియ్య. మనందరం దీనిపై పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఒకనాడు నేను చెప్పితే నన్ను అవమాన పరిచిండ్రు. నేను చెప్పిన ప్రతి మాట తెలంగాణ వచ్చాక రుజువు చేసి చూపించిన. ఇదే ప్రగతి, ఇదే పద్ధతి దేశం అంతా రావాలె. దేశం బాగుపడితే మనం బాగుపడుతాం. దేశం కోసం పోరాటానికి పోదామా.. అని ఏ జిల్లాలో అడిగినా ఇక్కడ ప్రజల్లోని చైతన్యమే కనపడుతున్నది.
భారతదేశంలో సామరస్యాన్ని, శాంతిని, మంచిని కాపాడటానికి.. మంచిని పెంచడానికి.. మంచిని పంచడానికి.. అవసరమైతే నా ప్రాణం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. తెలంగాణ కోసం కొట్లాడిన విధంగా భవిష్యత్తులో వచ్చే సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలె. ఈ కులం, మతం అనేది దరిద్రపు మాట. ప్రజలకు కొట్లాట పెడుతది. బుద్ధి తక్కువ పార్టీలు.. బుద్ధి తక్కువ నాయకులు. చిల్లర రాజకీయాల కోసం, స్వార్థం కోసం భరత జాతినే బలి పెట్టే విష ప్రయత్నాలు జరుగుతున్నయి. చైతన్యవంతులైన తెలంగాణ మేధావు లు దాన్ని తిప్పికొట్టాలి. మతపిచ్చి భయంకరమైన క్యాన్సర్ వంటి వ్యాధి. అది మనకు రాకుండా చూసుకోవాలె. అప్రమత్తంగా ఉండాలి.