బాల్కొండ/ముప్కాల్, సెప్టెంబర్ 5: సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. అమలుకు నోచుకోని హామీలు కేసీఆర్ ఇవ్వరని, పేద ప్రజలకు అక్కరకొచ్చే పనులే చేస్తారని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్తు, కుల వృత్తులకు ప్రోత్సాహం, సాగునీరు, సకాలంలో ఎరువులు ఇలా ఏ పథకాన్ని చూసినా కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అమలు చేస్తున్నారని తెలిపారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని బోదేపల్లి, వన్నెల్(బీ) గ్రామాల్లో రూ.2 కోట్లు, ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో సుమారు రూ.2.80 కోట్లతో మంత్రి వేముల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కన్నా గొప్పగా చేస్తామని మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదని, ఇప్పుడు చేస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన రూ.200 పింఛన్ను రూ.2 వేలకు పెంచింది కేసీఆర్ అని, కాంగ్రెస్ ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటే ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రూ.4 వేల పింఛన్ ఇచ్చి ఇక్కడ ప్రజలను ఓట్లు అడగాలని సూచించారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని రైతును మళ్లీ గోసపెట్టే కార్యక్రమానికి తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై విషం చిమ్మే బీజేపీ నాయకులు.. ముందుగా తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు కావడం లేదో సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీ బాండ్ పేపర్ రాసిచ్చి మరీ పసుపు రైతులను మోసం చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీల మోసపు మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మంత్రి వేముల పునరుద్ఘాటించారు.