నిజామాబాద్/సిద్దిపేట, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమాల ఊపిరిలూదిన కామారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో జన సునామీ పోటెత్తింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతికి రెండు చోట్ల ప్రజలు ఘనస్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు అద్భుత స్పందన లభించింది. మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డికి చేరుకున్న జననేతకు ప్రజలు నీరాజనం పలికారు. కామారెడ్డికి చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు వెల్లువలా తరలివచ్చి డప్పుల దరువు, గుస్సాడి నృత్యాలతో బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం పలికారు. అశేష జనవాహిని వెంట రాగా కేసీఆర్ బస్సుయాత్ర కామారెడ్డి పుర వీధుల్లో 45 నిమిషాలపాటు సందడిగా కొనసాగింది. వేలాదిగా ఎదురుచూస్తున్న ప్రజలను చూసి కేసీఆర్ అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, ప్రభుత్వ దవాఖాన నుంచి జేపీఎన్ రోడ్డుకు చేరుకున్నారు. మార్గమధ్యలో వందలాది మంది మహిళలు కేసీఆర్కు మంగళ హారతులు పట్టారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సుపైకి అడుగడుగునా పూల వర్షం కురిపించారు. బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలతో 44వ జాతీయ రహదారి జనసంద్రాన్ని తలపించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డి చౌరస్తాకు చేరుకోగానే ప్రజలు జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. రోడ్షోలో ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆసక్తిగా విన్నారు. వాగ్బాణాలు, విమర్శలతో సాగిన కేసీఆర్ ప్రసంగానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను కేసీఆర్ ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్ష సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పారని హస్తం పార్టీపై కేసీఆర్ మండిపడ్డారు. ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జనాలంతా ముక్తకంఠంతో పథకాలేవీ రాలేదని చేతులూపుతూ బదులిచ్చారు.
కామారెడ్డిలోని జేపీఎన్ రోడ్డులో తెలంగాణ ఆటా, పాటలతో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాల వివరాలతో కళారూప ప్రదర్శనలు ప్రజలను ఆలోచింపజేశాయి. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన దుర్భర పరిస్థితిని కండ్లకు కట్టేలా కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కేసీఆర్ను చూసేందుకు వచ్చిన మహిళలు నృత్యాలతో సందడి చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో మెదక్ జిల్లా కేంద్రం మురిసింది. మంగళవారం సాయంత్రం రాళ్లవాన, ఈదురుగాలను లెక్క చేయకుండానియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. కామారెడ్డి నుంచి రామాయంపేట మీదుగా రాత్రి 9.15 గంటలకు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాకు చేరుకున్న కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గులాబీ పూలవాన కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ఆర్అండ్బీ గెస్ట్హౌజ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు నేరుగా బస్సులో వచ్చారు. అప్పటికే అక్కడ ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారు. మెదక్ పట్టణంలోని రహదారులకు కిరువైపులా భారీగా జనంతో కిక్కిరిసిపోయింది. కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విన్నారు. జై కేసీఆర్.. మళ్లీ మీరే రావాలి సార్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్యారెంటీల గురించి కేసీఆర్ ప్రజలను అడిగినప్పుడు.. రాలేదు అంటూ ప్రజలు సమాధానం చెప్పారు. యువత కేరింతలు కొడుతూ జై కేసీఆర్, జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. చౌరస్తాలోని నలుదిక్కులా ఉన్న భవనాలపై ప్రజలు ఎక్కి కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మోసాలను ఎండగట్టినప్పుడు జనం తమ మద్దతు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దాం అన్నప్పడు.. గట్టిగా బుద్ధి చెబుదాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీ జిల్లా బిడ్డను ఇక్కడ ఏం అభివృద్ధ్ది చేసుకున్నామో మీ అందరికీ తెలసు అన్నప్పడు.. మళ్లీ మీరే రావాలి సార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరగా కేసీఆర్ ఉర్దూలో ప్రసంగించారు.
నిజామాబాద్ నుంచి బస్సులో కామారెడ్డికి వెళ్తున్న క్రమంలో ఇందల్వాయి టోల్గేట్ సమీపంలోని ఓ హోటల్లో కేసీఆర్ కాసేపు ఆగారు. ఆ హోటల్లో కాసేపు కూర్చొని పకోడీ తిన్నారు. సుమారు అరగంట సేపు అక్కడే గడిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున హోటల్ వద్దకు తరలివచ్చారు. వారిని ఆప్యాయంగా పలుకరించిన కేసీఆర్ వారితో సెల్ఫీలు దిగారు. కొంతమంది రైతులు, వృద్ధులతో మాట కలిపి వారి సాధక బాధకాలను విన్నారు.