కరీంనగర్, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి, కేప్రకాశ్రావు): కార్మిక క్షేత్రం కదం తొక్కింది.. తరలివచ్చిన ప్రజలు, కార్మిక లోకంతో గోదావరిఖని చౌరస్తా జనసంద్రమైంది.. ఉద్యమ సారథి, గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వస్వాగతం లభించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖనిలో శుక్రవారం కేసీఆర్ రోడ్షోకు అశేష జనవాహిని తరలివచ్చింది. ఎన్నికల కమిషన్ 48 గంటలపాటు ప్రచారంపై నిషేధం విధించిన అనంతరం తొలిసారిగా జరిగిన రోడ్షో గ్రాండ్ సక్సెస్ అయింది. కేసీఆర్ గోదావరిఖని పట్టణంలోకి రాగానే.. ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన రోడ్డుషో.. గోదావరిఖని చౌరస్తా వరకు కొనసాగింది. ఇసుకపోస్తే రాలనంత జనంతోపాటు అడుగడుగునా సంప్రదాయ నృత్యాల మధ్య కేసీఆర్ రోడ్షో కొనసాగింది.
దారి పొడవునా బస్సులో నుంచి కేసీఆర్ అభివాదం తెలుపుగా, ప్రజలు ఆయనను చూసేందుకు అమితాసక్తి చూపారు. ప్రధానంగా మహిళలు దారిపొడవునా కేసీఆర్కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కేసీఆర్ జిందాబాద్, సీఎం జిందాబాద్.. అంటూ పలుసార్లు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. పలుమార్లు కేసీఆర్ వారించినా.. ప్రజలు మాత్రం ‘సీఎం జిందాబాద్’ అన్న నినాదాలను మాత్రం ఆపలేదు. చౌరస్తాకు చేరుకున్న అనంతరం బస్సుపైకి కేసీఆర్ రాగానే.. గోదావరిఖని మొత్తం ధ్వనించేలా ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.. ‘మా సీఎం మీరే’ అంటూ.. చేసిన నినాదాలతో నలుదిక్కులు పిక్కటిల్లాయి. కేసీఆర్ రోడ్డు షో సందర్భంగా గోదావరిఖని మొత్తం గులాబీమయం అయింది. అనంతరం 28 నిముషాలపాటు ఉద్వేగభరితంగా కేసీఆర్ ప్రసంగించగా.. ప్రజలు ఎంతో ఆసక్తిగా విన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై పలు ప్రశ్నలు సంధించారు. నవ్వుతూ, నవ్విస్తూ ప్రశ్నలు అడిగిన తీరు ప్రజలను ఆకట్టుకున్నది.
ప్రజల నుంచి విశేష స్పందన
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ఎండగట్టినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఒక్కొక్కదాని పేరు చెప్తూ వచ్చిందా? అని అడిగినప్పుడు జనం నుంచి ‘రాలేదు.. రాలేదు’ అంటూ సమాధానం వచ్చింది. ప్రధానంగా తులం బంగారం వచ్చిందా? అని అడిగిన ప్రశ్నకు జనం నుంచి ‘రాలేదు.. రాలేదు’ అంటూ సమాధానం వచ్చింది.. ఏ రెండు తులాలు వచ్చిదంట కదా.. అని నవ్వుతూ జోక్ వేయగా.. ‘మళ్లీ రాలేదు.. రాలేదు’ అంటూ చేతులూపుతూ చెప్పారు. ఇక్కడ మోసం జరిగిందా? అంటే అవును అంటూ అందరూ తలలూపుతూ సమాధానం చెప్పారు. అలాగే నాలుగు వేల పింఛన్ వచ్చిందా? అని కేసీఆర్ అడిగితే.. రాలేదంటూ మార్మోగేలా ప్రజల నుంచి సమాధానం వచ్చింది. ఇదే సమయంలో ‘మీకు ఆరువేలు వచ్చిదంట కదా’ అని కేసీఆర్ నవ్వుతూ ప్రశ్నించగా, అంతే స్పీడ్తో ‘ఏమీ రాలేదు’ అంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. మహిళలకు రూ.2500 వచ్చాయా? అంటూ కేసీఆర్ ప్రశ్నించగా.. ఏదీ రాలేదంటూ గట్టిగా చెప్పారు. రైతు కూలీలకు రూ.15 వేలు వచ్చినయా? అందరికీ రైతు బీమా వచ్చిందా? అంటూ ప్రశ్నించగా.. ఏదీ లేదంటూ చేతులూపుతూ ప్రజలు సమాధానం ఇచ్చారు. దళితబంధు వస్తుందా? అన్న ప్రశ్నకు.. రావడం లేదంటూ ప్రజలు సమాధానం చెప్పారు.
నినదించిన సింగరేణి కార్మికులు
‘సింగరేణిని నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ.. కేంద్రం వద్ద అప్పులు చేసి.. 49 శాతం వాటా కట్టబెట్టింది ఎవరు?’ అని అడిగితే… కాంగ్రెస్, కాంగ్రెస్ అంటూ కార్మికులు నినందించారు. సింగరేణిలో 19 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? అని అడిగితే.. అది మీరే మీరే అంటూ కేసీఆర్ వైపు వేలు చూపిస్తూ ప్రజలు సమాధానం చెప్పారు. మన సింగరేణి కొంగుబంగారం.. దానికి అన్యాయం జరిగితే మనమంతా ఒక్కటై పోరాడాలి అంటూ కేసీఆర్ చెప్పగా.. పిడికిళ్లెత్తి కేసీఆర్కు సంఘీభావం ప్రకటించారు. మీ బిడ్డ సింగరేణి కార్మికుడు… మృదు స్వభావి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా.. ‘కొప్పుల జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సింగరేణిపై సీపీఐ, సీపీఎం వైఖరులు చెప్పాలని కేసీఆర్ సభలో నిలదీసినప్పుడు జనం నుంచి విశేష స్పందన కానవచ్చింది.