KCR | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతలు వసతులు, వనరులను వాడుకోలేని దద్దమ్మలు, అవివేకులు, తెలివి తక్కువవాళ్లు అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. టీవీ9 ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన్నాడు 7,700 మెగావాట్ల కరెంటు ఉండేదని, దిగిపోయేనాటికి 19,100పైగా మెగావాట్లు.. మొన్న ఎన్టీపీసీ అందుబాటులోకి రావడంతో 20,000 మెగావాట్లు దాటిందని, తొమ్మిదేండ్లు నిరాటంకంగా వచ్చిన కరెంటు కేసీఆర్ పక్కకు పోగానే కటక బంద్చేసినట్టు కరెంటు ఎందుకు పోయిందని నిలదీశారు. మంచినీళ్లు ఎందుకు రావడంలేదు, ఎందుకు సాగునీళ్ల ఇబ్బంది వచ్చిందని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పాలకుల అసమర్థత, అవగాహన లేమికి నిదర్శనమన్నారు.
జవాబు: కరెంటుపై కూడా వాళ్లు వెకిలి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికి కరెంటు షార్టేజ్ 2,700 మెగావాట్లు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ వినియోగం ఆధారంగా ఆనాటి విద్యుత్ ఉత్పత్తిలో పదేండ్ల్లపాటు 53.89 శాతం తెలంగాణకు, 46.11శాతం ఏపీకి కరెంటు ఇవ్వాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రాజ్యాంగం సాక్షిగా ఏపీ ఉల్లంఘించింది. ఏపీ చట్టాన్ని ఉల్లంఘించగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడు మండలాలను ఏపీకి ఇవ్వడమే కాకుండా 400 మెగావాట్ల సీలేరు పవర్ప్లాంట్ను కూడా ఏపీకి ఇచ్చారు. దీనిపై మేము పోరాటంచేస్తే కేంద్రం పట్టించుకోలేదు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలోని ఏన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో మా వాదనను ఆనాడు పట్టించుకోలేదు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ కూడా ఇవ్వలే. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ అంధకారమవుతుందని చెప్పారు. ఇది కూడా ఓ చాలెంజ్ మాకు. రాష్ట్రంగా మేము నిలదిక్కుకోవాలి.
ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొందరు తెలంగాణలో గెలిచారు. ఇయ్యాల రాష్ర్టానికి ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీలోని వాడే. కరెంటు ఇవ్వాలంటూ అతను అసెంబ్లీలో గోల.. నానా హంగామా. దీంతో కరెంటు కొనక తప్పని పరిస్థితి. ఈ రాష్ట్రం నేషనల్ గ్రిడ్లో లేనందున ఎక్కడినుంచంటే అక్కడినుంచి కొనే అవకాశం లేదు. మనం సదరన్ గ్రిడ్లో ఉన్నాం. సదరన్ గ్రిడ్ నుంచి కొనాలంటే ఇక్కడ కరెంటు లేదు. దీంతో తెలంగాణను నేషనల్ గ్రిడ్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాం. వార్ధా-డిచ్పల్లి, అంగుల్-పలాస, వరంగల్-వరూర లైన్లను కలిపితేనే నేషనల్ గ్రిడ్లోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మల్ల రెండు రాష్ర్టాలను కలిపేస్తాం..బెర్లిన్ గోడలను బద్దలు కొట్టి ఐక్యం కాలేదా.. అనే వాదనలు వినిపించాయి. వీళ్లని నల్లిఫై చేయాలంటే మనం నిలదొక్కుకోవాలి అనే సంకల్పంతో, పరిశ్రమలను ఆకర్షించాల.. రియల్ ఎస్టేట్ను పెంచాల అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేశాం. ఇండియాలో ఛత్తీస్గఢ్, ఒడిశాలలోనే కరెంటు లభ్యత ఉంది. అయినప్పటికీ కరెంటు ఉన్నా ఇవ్వలేని గందరగోళ పరిస్థితి ఉండేది. డిస్ట్రిబ్యూషన్ సిస్టం కూడాసరిగా లేదు. దీనికి రూ. 12000కోట్లు అవసరమవుతుందని ఇంజినీర్లు చెబితే వెంటనే చేయమని చెప్పాను. మేము జూన్లో అధికారంలోకి వస్తే సెప్టెంబర్ చివరి వరకు వ్యవసాయరంగం మినహా అందరికీ 24 గంటల కరెంటు ఇచ్చాం. అంతా ఎంతో ఆశ్చర్యపోయారు.
జవాబు: రూ.13కు విద్యుత్ కొన్నామనేది దారుణమైన ఆరోపణ. వాస్తవంగా విద్యుత్ కొనుగోలు చేసింది రూ.3.90కి మాత్రమే. విద్యుత్ కొనుగోలు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పీపీఏ చేసుకొని కొనుగోలు చేయడం, రెండోది.. షేర్ మార్కెట్ తరహాలో ఓపెన్ మార్కెట్లో కొనడం. పీక్ లోడ్ వచ్చినప్పుడు తాత్కాలికంగా ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేస్తారు. ఇది రోజురోజుకూ రేటు మారుతూ ఉంటుంది. కేరళలో కాయంకూరంలోని ఎన్టీపీసీ ప్లాంటు నుంచి కొనుగోలు చేయాలని తానే స్వయంగా వాళ్లతో మాట్లాడితే రూ.17 చొప్పున ఇస్తామన్నారు. తక్కువకు ఇచ్చేందుకు వాళ్లు ఒప్పుకోకుంటే మేము వారివద్ద తీసుకోలేదు. కొన్ని సందర్భాల్లో మూడు-నాలుగు-ఐదు రోజులకోసం రూ.15-20కి కూడా కొంటారు. దీనికి రెగ్యులేటరీ కమిషన్ అడ్డంరాదు. పరిశ్రమల కోసం, పంటలను కాపాడుకోవడం కోసం తాత్కాలిక పద్ధతిలో ఇలా ఓపెన్ మార్కెట్లో కొనాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా అధికరేట్లకు కొనుగోలు చేస్తున్నది. రూ.13 కన్నా ఎక్కువ ధరకు కూడా కొన్నారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు కొంటున్నది. దీనికి ఏమి సమాధానం చెబుతారు?
జవాబు: మేం వచ్చిన్నాడు 7,700 మెగావాట్ల కరెంటు ఉండేది. మేము దిగిపోయేనాటికి ఉత్పత్తి చేసింది 19,100పైగా మెగావాట్లు. మొన్న ఎన్టీపీసీ అందుబాటులోకి రావడంతో 20,000మెగావాట్లు దాటింది. కేసీఆర్ పక్కకు పోగానే కటక బంద్చేసినట్టు కరెంటు ఎందుకు పోయింది, మంచినీళ్లు ఎందుకు రావడంలేదు, ఎందుకు సాగునీళ్ల ఇబ్బంది వచ్చింది అని మేము కూడా అడుగుతున్నాం. అందుకే నేను అంటున్న.. వీళ్లు ఉన్న వసతులు, వనరులను వాడుకోలేని దద్దమ్మలు, అవివేకులు, తెలివి తక్కువవాళ్లు. తొమ్మిదేండ్లు నిరాటంకంగా వచ్చిన కరెంటు ఎందుకు పోయింది. ఇది అసమర్థత, అవగాహన లేమి. నేను ఐఏఎస్లను తీసి మొత్తం టెక్నోక్రాట్స్ను పెట్టాను. నేడు మళ్లీ టెక్నోక్రాట్స్ను తీసేసి ఐఏఎస్లను పెట్టారు. మా పదేండ్లలో మేము పెట్టిన ఖర్చు రూ.14.5 లక్షల కోట్లు. తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. యుఎన్వోసహా అనేక సంస్థలనుంచి ప్రశంసలు వచ్చాయి.
జవాబు: అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు హరీశ్రావు, కేటీఆర్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. సొల్లు పురాణం చెప్పుడు కాదు.. విచారణ చేయించండి. మీ డొల్ల ఆరోపణను మేము నిరూపిస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం.
జవాబు: మాటలు మాట్లాడడం వేరు. విద్యుత్పై నేను చెప్పే మాటలు ప్రజల అనుభవంలోనే ఉన్నాయి కదా. కేసీఆర్ ఉన్నప్పుడు పరిశ్రమలకు, ఐటీ రంగానికి, గృహాలకు, వ్యవసాయానికి ఎలా వచ్చిందనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే నిర్ణేతలు. అందుకే నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా… కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ నిరంతరంగా వచ్చిందా లేదా, ఇప్పుడు ఇబ్బందులు కలుగుతున్నాయా లేదా. కరెంట్పై నేను చెప్పే మాటలు నిజమైతే పార్లమెంట్ ఎన్నికల్లో మా వాళ్లను గెలిపించండి లేదా మావాళ్లను ఓడించండి.
జవాబు: అమ్మ పెట్టదు.. అడుక్కోని తిననివ్వదు. కరెంటు ఎలా వస్తుంది చెప్పండి. అతి భయంకరంగా, అతి దారుణంగా ఉన్న కరెంటు వ్యవస్థని చక్కగచేసి, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించి, అనేక పవర్ప్లాంట్లకు శ్రీకారం చుట్టి, ఎన్టీపీసీలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం. కరెంటు ఉత్పత్తి వెంటనే కాదు కాబట్టి అందుబాటులో ఉన్నచోట కొనుక్కోక తప్పదు. విద్యుత్ అధికరేట్లకు కొన్నట్టు, యూనిట్ రూ.13 చొప్పున కొన్నట్టు బాకా, కాకా పట్టే మీడియా ద్వారా, అమ్ముడుపోయే కొన్ని యూట్యూబ్ చానళ్ల ద్వారా చెప్పారు. వాస్తవానికి రూ.3.90 చొప్పున మాత్రమే విద్యుత్ కొనుగోలు చేశాం. టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది. వాళ్లే ధరలు నిర్ణయిస్తారు. ఇందులో కంపెనీలకు, ప్రభుత్వాలకు ఎటువంటి పాత్ర ఉండదు. తెలంగాణ, ఛత్తీస్గడ్ రాష్ర్టాల ఈఆర్సీలు అప్రూవ్ చేసిన రేటు ఇది.
జవాబు: అతి భయంకరంగా, అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్రంగాన్ని అందరూ ఆశ్చర్యపడేలా, అన్ని వర్గాలవారికి 24 గంటల నిరంతర కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ దోషి అయితడా? అంతా సిద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థను అందించలేని అర్భకులు మాపై చేసే ఆరోపణలు నిజం. ఇదా.. ఎవరిదైనా అంతరాత్మ ఒప్పుకుంటుందా. దీన్ని బుద్ది ఉన్నవాళ్లేవరైనా ఒప్పుకుంటారా. ఇక నేను బాధ్యతలు అప్పగించిన విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్రావు కరెంట్రంగంలో తలపండిన వ్యక్తి. ఆయనతోపాటు హైడల్ డైరెక్టర్ వెంకట్రాజం, భాగ్యత్రెడ్డి, రఘుమారెడ్డి వీళ్లంతా అద్భుతమైన టెక్నోక్రాట్స్. ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించుకుంటూ ఆలోచన చేసి అతి తక్కువ ధరలో కరెంట్ వచ్చేలా ప్రణాళికలు వేసేవాళ్లం. ఇదంతా పక్కనపెట్టి ‘మమ్మల్ని బద్నాం చేస్తాం. మేం అసమర్థులం కరెంట్ ఇవ్వలేం.’ అంటే ఇది ఎవరి తప్పు. అసలు నేరస్థులు, అసమర్థులు వాళ్లు.